Maharashtra Political Crisis: శివసేన అధికారం కోసం పుట్టలేదు.. : సంజయ్ రౌత్
Maharashtra Political Crisis: శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశం మరోసారి దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే స్పందించిన శివనేన నాయకుడు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్.. శివసేన అధికారం కోసం పుట్టలేదని స్పష్టం చేశారు. అధికారమే శివసేన కోసం పుట్టిందని పేర్కొంటూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. వివరాల్లోకెళ్తే.. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల కారణంగా బలపరీక్షకు ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బుధవారం రాత్రి తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి అందజేశారు. తన కుమారులు ఆదిత్య థాక్రే, తేజస్ థాక్రేలతో పాటు శివసేన నేతలు నీలం గోర్హే, అరవింద్ సావంత్ సహా పలువురితో కలిసి దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఉన్న రాజ్భవన్లో రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఆయన గవర్నర్ను కలిశారు. తన రాజీనామా లేఖను అందించారు. ఈ క్రమంలోనే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను ఆమోదించారు.
అయితే, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ఉద్ధవ్ థాక్రే రాజీనామా అనంతరం శివసేన నాయకుడు సంజయ్రౌత్ మాట్లాడుతూ.. శివసేన అధికారం కోసం పుట్టలేదు, అధికారం శివసేన కోసం పుట్టిందని పేర్కొన్నారు. "శివసేన అధికారం కోసం పుట్టలేదు.. అధికారం శివసేన కోసం పుట్టింది. ఇది ఎప్పటినుంచో బాలాసాహెబ్ ఠాక్రే మంత్రం. తాము ప్రజల కోసం పనిచేసే వారమని నిరూపించుకుని మరోసారి అధికారంలకి తప్పకుండా వస్తాం" అని ఉద్ధవ్ థాక్రే రాజీనామా తర్వాత శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు.
కాగా, ప్రభుత్వ ఏర్పాటు, తదుపరి కార్యాచరణను తమ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, తిరుగుబాటు శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే నిర్ణయిస్తారని మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు. కాగా, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో పలువురు శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఉద్ధవ్ థాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు బుజ్జగించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. గత వారం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మంది తిరుగుబాటు గ్రూప్ లో చేరారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గుజరాత్లోని సూరత్ కు చేరుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. అటునుంచి అసోంలోని గౌహతికి వెళ్లారు. అక్కడే మకాం వేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. వెనక్కి తగ్గకపోవడంతో ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలవడంతో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శిబిరం దూకుడు పెంచింది.
శివసేన నాయకుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఏ) సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని పేర్కొంటూ బలపరీక్షకు ఆదేశించాలని కోష్యారీని ఫడ్నవిస్ కోరారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే శివసేన గవర్నర్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు దీనికి నో చెప్పడంతో ప్లోర్ టెస్టు అనివార్యం అయింది. అయితే, ప్లోర్ టెస్టుకు ముందే తప్పుకోవడం ఉత్తమం అని భావించిన ఉద్ధవ్ థాక్రే.. బుధవార రాత్రి రాజీనామా చేశారు.