Maharashtra Political Crisis: షిండే వర్గంలో చేరిన మరో మంత్రి.. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
Maharashtra Political Crisis: అసోంలోని గౌహతిలో ఉన్న శివసేన రెబల్స్ క్యాంప్ లో తాజాగా ఉన్నత విద్య, సాంకేతిక శాఖ మంత్రి ఉదయ్ సమంత్ చేరారు. ఈయన చేరికతో షిండే శిబిరంలో మంత్రుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఉద్దవ్ థాకరేపై రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు రోజురోజుకు తీవ్రమవుతోంది. అసోంలోని గౌహతిలో ఉంటూ శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే క్యాంప్ రాజకీయాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. తన గూటిలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కాకుండా.. ఇతర ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. క్రమంగా రెబల్స్ బలాన్ని మరింత పెంచే దిశగా పావులు కదుపుతున్నారు. పలువురు కీలక నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. తాజాగా మరో ఎమ్మెల్యేను తన గూటిలో చేర్చుకున్నారు.
ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి, శివసేన ఎమ్మెల్యే ఉదయ్ సమంత్ సైతం గౌహతికి బయలుదేరారు. ఆయన గుజరాత్లోని సూరత్ నుంచి సమంత్ గౌహతికి చేరుకున్నట్లు సమాచారం. ఆయన మరో ముగ్గురు నేతలు కలిసి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో గౌహతిలోని గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం సమంత్ కాన్వాయ్ కి అస్సోం పోలీసులు భద్రతా కల్పించి.. రాడిసన్ బ్లూ హోటల్కు తీసుకెళ్ళినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో మంత్రి ఆదిత్య ఠాక్రే మరోసారి తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. శివసేన పార్టీలోకి తిరిగి రావాలనుకునే వారికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. దేశ వ్యతిరేకులైన రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో Maharashtra Political Crisis చేర్చుకోమని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు షిండే శిబిరంలో..మహారాష్ట్ర కేబినెట్ మంత్రులు గులాబ్రావ్ పాటిల్, దాదా భూసే, సందీపన్ బుమ్రే, రాష్ట్ర మంత్రులు శంబురాజే దేశాయ్, అబ్దుల్ సత్తార్ చేరారు. ఎమ్మెల్యే ఉదయ్ సమంత్ ఈ శిబిరంలో చేరితే.. షిండే వర్గానికి మరింత బలం చేకూరినట్టు అవుతోంది.
జూన్ 22 నుంచి MVA ప్రభుత్వంపై రెబల్స్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో.. ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం తొలుత జూన్ 21న ముంబై నుంచి సూరత్కు.. మరుసటి రోజు గౌహతికి చేరుకుంది. అప్పటి నుండి.. గౌహతి కేంద్రంగా క్యాంప్ రాజకీయాలు జరుగుతున్నాయి. పలు నేతలతో చర్చలు, భేటీలు, సమావేశాలు నిర్వహిస్తూ.. మహారాష్ట్ర సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నారు రెబల్ నేతలు.
రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
షిండేతో సహా 16 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మహారాష్ట్ర లెజిస్లేచర్ సెక్రటేరియట్ వారికి శనివారం సమన్లు జారీ చేసింది. ఈ రెబల్స్ ఎమ్మెల్యేలు జూన్ 27 సాయంత్రంలోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలి. అనర్హత వేటు పడకుండా ఉండాలంటే.. విలీనం ఒక్కటే మార్గం, కానీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుండి తప్పించుకోలేరు ఎందుకంటే ఈ వ్యక్తులు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ విలీనం కాలేదు. నోటీసు అందిన తరువాత, ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం నుండి నోటీసుపై స్పందించడానికి వివిధ ఎంపికలపై చర్చిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.