తలలేని మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. భార్యను హత్య చేసిన భర్త
Maharashtra: తలలేని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఆసిఫ్ షేక్ తన భార్య సానియాను నలసోపరాలో అత్యంత క్రూరంగా నరికి చంపినందుకు పోలీసు అతన్ని అరెస్టు చేశారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.
Headless body case: మహారాష్ట్రలో తలలేని మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. అత్యంత క్రూరంగా హత్య చేసి.. శరీరం నుంచి తలను వేరుచేసిన దారుణ ఘటనకు పాల్పడింది మృతురాలి భర్తేనని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకెళ్తే.. వాసాయ్లోని భుయిగావ్ బీచ్లో ట్రావెల్ బ్యాగ్లో తల లేని, పాక్షికంగా కుళ్ళిన మహిళ మృతదేహం కొట్టుకువచ్చిన 14 నెలల తర్వాత.. పోలీసులు ఆ కేసును ఛేదించారు. పోలీసులు గురువారం ఆమె భర్తను హత్య చేసినందుకు అరెస్టు చేశారు. ఆసిఫ్ షేక్ తన భార్య సానియా (25)ని వారి నలసోపరా ఇంట్లో హత్య చేశాడు. గత సంవత్సరం బక్రీద్ రోజున అక్రమ సంబంధానికి సంబంధించి ఇద్దరిమధ్య జరిగిన గొడవ తర్వాత ఆమె తల నరికి చంపాడని పోలీసులు తెలిపారు. సానియా తల, హత్యకు ఉపయోగించిన ఆయుధం ఇంకా లభ్యం కావాల్సి ఉందని వసాయ్ సీనియర్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్రావు కర్పే తెలిపారు.
కాగా, ఈ జంట నలసోపరా (తూర్పు)లోని అచోల్లోని రష్మీ రీజెన్సీ అపార్ట్మెంట్లో ఉమ్మడి కుటుంబంలో నివసించారు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమై మూడేళ్ల కుమార్తె ఉంది. సానియాను తన భర్త, అత్తమామలు డబ్బు కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత ఏడాది జూలై 21న, లాక్డౌన్ సమయంలో సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఆసిఫ్ (31) సానియాను హత్య చేసి, ఆమె తల నరికి, మృతదేహాన్ని చక్రాల ట్రావెల్ బ్యాగ్లో నింపి, క్యాబ్ను అద్దెకు తీసుకుని, మృతదేహాన్ని నలసోపరాలోని కలాంబ్ బీచ్లోని మడ అడవుల్లో పడేశాడు. అయితే, ఐదు రోజుల తర్వాత మృతదేహం నీటిలో కొట్టుకురావడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ ఘటన కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. కేసును ఛేదించేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ ఫిర్యాదులను ఒక సంవత్సరం పాటు పరిశీలించారు. బాధితురాలి చేతులపై ఉన్న మెహెందీ డిజైన్ ఆమె ముస్లిం వర్గానికి చెందినదని మాకు క్లూ లభించిందని వసాయ్ సీనియర్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్రావు కర్పే చెప్పారు.
ఆగస్టు 29న సానియా కుటుంబసభ్యులు అచోల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదటి లీడ్ లభించిదన్నారు. ఆమె ఒక సంవత్సరం నుంచి కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె భర్త ఆసిఫ్ తమను తప్పించుకుని తిరుగుతున్నాడనీ, కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని పోలీసులు తెలిపారు. అంధేరీలోని ఓ షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆసిఫ్ను పోలీసులు ఆరా తీశారు. గత ఏడాది జూలైలో సానియా తన బాయ్ఫ్రెండ్తో కలిసి పారిపోయిందని పోలీసులు సమాధానమిచ్చాడు. అలాగే, ఆమె తనను వదిలివెళ్లిపోయిందని చేతితో రాసిన లేఖను కూడా పోలీసులకు అందించాడు. ఈ క్రమంలోనే మృతదేహానికి ఆసిఫ్, సానియా దంపతుల కుమార్తెతో ఉన్న డీఎన్ఏల నమూనా సరిపోలడంతో డెడ్ బాడీ వివరాలు పూర్తిగా తెలిసిపోయాయి. రాసిన లేఖపై చేతిరాత ఆసిఫ్తో చేతిరాతతో సరిపోయింది. పోలీసులు తమదైన తరహాలో విచారణ జరపడంతో నిందితుడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.
తన భార్యను హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే, ఈ ఘటనతో అతని కుటుంబ ప్రమేయం ఉన్న అవకాశాన్ని పోలీసులు తోసిపుచ్చలేదు. ఈ ఘటనపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సాయంత్రం తన కుటుంబం బంధువుల వద్దకు వచ్చినప్పుడు తన భార్యను వారి బెడ్రూమ్లో హత్య చేసి మృతదేహాన్ని పారవేసినట్లు ఆసిఫ్ చెప్పాడు. సానియా పారిపోయిందని, నలసోపరా ఫ్లాట్ని అమ్మి ముంబ్రాకు వెళ్లిందని అందరికీ చెప్పాడు. సానియా బంధువులు నలసోపరా ఇంటికి వచ్చినప్పుడు, అది అమ్మబడినట్లు గుర్తించి షాక్ అయ్యారు. అవకతవకలపై అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ నేరం తీరు వెలుగులోకి వచ్చింది.