మరాఠీ పాటలు పెట్టలేదని హోటల్ సిబ్బందిపై ఎంఎఎన్ఎస్ కార్యకర్తల దాడి
Mumbai: మరాఠీ పాటలను ప్లే చేయనందుకు రాజ్ థాకరే పార్టీ ఎంఎన్ఎస్ కు చెందిన కార్యకర్తలు ఒక హోటల్ సిబ్బందిని కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మొదట హోటల్లో మరాఠీ పాటలు ప్లే చేయడంపై వాదన మొదలైంది. అందుకు మేనేజర్ నిరాకరించడంతో అతని పై ఎంఎన్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు.
Maharashtra Navnirman Sena(MNS): రాజ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ మారింది. అయితే, ఆ వీడియో ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఒక హోటల్ సిబ్బందిపై దాడికి సంబంధించినది కావవడం గమనార్హం. ఈ గోడవ వెనుక మరాఠీ పాటలు ప్లే చేయలేదనే కారణంగా తెలుస్తోంది.
వివరాల్లోకెళ్తే.. మరాఠీ పాటలను ప్లే చేయలేదని దేశ ఆర్థిక రాజధాని ముంబయి సమీపంలోని వాషిలోని ఓ హోటల్ సిబ్బందిని రాజ్ థాకరేకి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొట్టారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మొదట మరాఠీ పాటల విషయంలో కొంతమందికి, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం మధ్యలోకి అక్కడే ఉన్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు కూడా చేరారు. సిబ్బంది-మేనేజర్ అక్కడ జరిగిన పరిస్థితిని ఎంఎన్ఎస్ కార్యకర్తలకు వివరించడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే ఆ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. సమస్య తీవ్రమై హింసాత్మకంగా మారింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ ఘటనను మొబైల్లో చిత్రీకరించి.. వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వైరల్గా మారింది. సంబంధిత వీడియోలో కొంతమంది మహిళలు హోట్ సిబ్బంది, మేనేజర్ తో మరాఠీ పాటలు ప్లే చేయమని అడుగుతున్నారు. అయితే, దీనికి హోటల్ వాళ్లు నో చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఇది మహారాష్ట్ర, ఇక్కడి వాళ్లు మరాఠీ పాటలు వింటారని ప్లే చేయమని చెప్పారు. అయితే, ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. పార్టీని బుక్ చేసుకున్న వ్యక్తికి మాత్రమే పాటలకు సంబంధిచి వివరాలు, బుకింగ్ చూపిస్తానని మేనేజర్ చెప్పడంతో వారిపై అక్కడున్న ఎంఎన్ ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.
ముందు మహిళలు మేనేజర్ తో పాటల విషయంపై వాగ్వాదం చేస్తుండగా, ఆ సమయంలో పక్కనే నిల్చున్న ఎంఎన్ఎస్ కార్యకర్త అక్కడికి వచ్చి.. ‘‘మేం మహారాష్ట్రలో ఉన్నాం, మరాఠీ పాటలు మాత్రమే వినిపిస్తాయి.. ప్లే చేయండి అని చెప్పగా.. మేనేజర్ లేదు.. ప్లే చేయం అని చెప్పడంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మేనేజర్ పై దాడి" చేశారు. అయితే, ఈ ఘర్షణకు సంబంధించి ఎవరుకూడా ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదనీ, ఎవరుకూడా ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
కాగా, ఇదివరకు ఎంఎన్ఎస్ మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప్లే చేయడం, ఇదే సమయంలో మసీదులపై నుంచి మైకులు, సౌండ్ బాక్సులను వెంటనే తొలగించాలని అప్పటి కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల నాయకత్వంలోని మహావికాస్ అఘాడీకి నాయకత్వం వహించిన ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని రాజ్ థాక్రే హెచ్చిరించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే.. రాష్ట్రంలోని అన్ని మసీదుల ముందు ఎంఎన్ఎస్ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను ప్లే చేస్తారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల చర్యలు, కోర్టుల కేసుల తర్వాత కొన్ని రోజులకు ఈ అంశం సద్దుమనిగింది.