ఆయుర్వేద చికిత్సతో క్యాన్సర్ నయం చేస్తామని రూ. 15 లక్షల మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు
మహారాష్ట్రలోని థానేలో ఓ ఆయుర్వేద చికిత్స కేంద్రం తనను మోసం చేసిందని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యకు క్యాన్సర్ను నయం చేస్తామని చెప్పి తన వద్ద రూ. 15 లక్షలు గుంజారని, ఇప్పుడు ముఖం చాటేశారని ఆరోపించాడు. ఆ ఆయుర్వేద కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైంది.
థానే: ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయుర్వేద చికిత్సపై ఆధారపడటం దాదాపు తగ్గిపోయింది. కానీ, ఆయుర్వేద వైద్యంపై ఉన్న నమ్మకాలు మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ఈ నమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు అమాయక ప్రజలను చీట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని థానేలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా క్యాన్సర్నే నయం చేస్తామని ఓ ముఠా నయవంచనకు పాల్పడింది. రూ. 15.22 లక్షలను ట్రీట్మెంట్ పేరిట మోసం చేసి ఆ తర్వాత ముఖం చాటేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
రైల్వే శాఖలో పని చేస్తున్న పెయింటర్ నౌపడా పోలీసు స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఆయుర్వేద చికిత్సతో తన భార్య క్యాన్సర్ను నయం చేస్తామని ఓ ఆయుర్వేద ట్రీట్మెంట్ సెంటర్ తమను మోసం చేసిందని ఆరోపించాడు. రూ. 15.22 లక్షల మోసం చేశారని వివరించాడు.
తన భార్యకు గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ చికిత్స అందిస్తున్నారని, కానీ, తన భార్య ఆరోగ్య పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదని పేర్కొన్నాడు. అంతేకాదు, కొన్ని రోజులుగా ఆ ఆయుర్వేద చికిత్స కేంద్రానికి చెందిన వ్యక్తులు తన నుంచి తప్పించుకోవడం మొదలు పెట్టారని తెలిపాడు. ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులపై చీటింగ్, ఇతర నేరాలపై శనివారం కేసు నమోదైనట్టు వివరించాడు.
Also Read: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 149 రోజుల్లో ఇదే అత్యధికం..
ఈ కేసులో ఇప్పటికైతే ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. బాధితులు చేసిన ఆరోపణలను దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.