మహారాష్ట్ర హెచ్ఎస్సీ ఎగ్జామ్స్ పేపర్ లీక్ కేసు.. మ్యాథ్స్ తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు కూడా...
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు వాట్సాప్ ద్వారా విద్యార్థులకు షేర్ చేశారు.
ముంబై : తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిమీద తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో 12వ తరగతి పేపర్ల లీక్ సంచలనం సృష్టిస్తోంది. అక్కడ హెచ్ఎస్సి బోర్డ్ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దీంట్లో భాగంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం మ్యాథమెటిక్స్ పేపర్ తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లను కూడా మేనేజ్మెంట్ లీక్ చేసినట్లు గుర్తించామని పోలీసులు గురువారం తెలిపారు.
మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ కావడానికంటే ముందే మరో రెండు పేపర్లు లీక్ అయినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 27న ఫిజిక్స్, మార్చి 1న కెమిస్ట్రీ పేపర్లు లీక్ అయ్యాయని, పరీక్షకు హాజరయ్యే గంట ముందు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పేపర్ షేర్ చేశారని అధికారి తెలిపారు. "వాట్సాప్ ద్వారా ప్రశ్న పత్రాలను పంచుకున్నారు. అహ్మద్నగర్లోని మాతోశ్రీ భాగూబాయి భంబరే అగ్రికల్చర్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ సిబ్బందిని అరెస్టు చేసి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు" అని ముంబై పోలీసులు తెలిపారు.
పేపర్ లీక్.. టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం, ఏప్రిల్లో జరిగే పరీక్షల ప్రశ్నాపత్రాలు మార్పు
మరో రెండు పేపర్లు లీక్ అయినట్లు రుజువు చేసే కొన్ని ఆధారాలు దొరికాయని క్రైం బ్రాంచ్ అధికారి తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ అధికారి మాట్లాడుతూ, "అరెస్టయిన యాజమాన్యం, కాలేజీ లెక్చరర్ల నుండి వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నప్పుడు.. ఆ ఫోన్లలోని వాట్సాప్ డేటాను రికవర్ చేసి పరిశీలించగా.. పోలీసులకు తగిన ఆధారాలు లభించాయి" అన్నారు.