దేశంలో కరోనా మహమ్మారి ధాటికి తీవ్రంగా వణికిపోతోన్న మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కట్టడి చేసేందుకు గాను రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. 

దేశంలో కరోనా మహమ్మారి ధాటికి తీవ్రంగా వణికిపోతోన్న మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కట్టడి చేసేందుకు గాను రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతిపై సీఎం ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన సమావేశమైన కేబినెట్, మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది.

తాజా ఆంక్షలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు (మూడు రోజులు) పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించింది. 

ఇక పగటి వేళల్లో సైతం ఐదుగురు కంటే ఎక్కువ మంది సమూహాలుగా ఏర్పడే అవకాశం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా కేవలం 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయని ప్రకటించింది.

ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. పగటి వేళల్లోనే హోం డెలివరీ సర్వీసులను అనుమతించనున్నారు. బస్సులు, రైళ్లు కూడా 50 శాతం సామర్థ్యంతోనే నడుస్తాయని తెలిపింది.

కర్ఫ్యూ అమలులో వున్న సమయంలో హోటళ్లు, మాల్స్‌, రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుంది సర్కార్.

లాక్‌డౌన్ అమల్లో వున్నప్పటికీ నిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాలను మాత్రం కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. థియేటర్లు కూడా మూతబడనున్నాయి.

అయితే, తక్కువ జనాభాతో షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వారాంతంలో మాత్రం కేవలం అత్యవసర సర్వీసులకు తప్ప మిగతా అన్ని వ్యాపారాలు బంద్‌ పాటించాలని మహారాష్ట్ర సర్కార్ ఆదేశించింది.