మహారాష్ట్రలో రాజకీయాలు మళ్లీ రసవత్తరం అవుతున్నాయి. మొన్నటి వరకు లౌడ్స్పీకర్ల గొడవ తీవ్రరూపం దాల్చుతుండగా, ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. హనుమానల్ చాలీసా పఠనం వివాదంగా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపు ఇవ్వగా బీజేపీ గైర్హాజరైంది. అనంతరం, అధికార, ప్రతిపక్షాలు వేర్వేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకున్నారు.
ముంబయి: మహారాష్ట్రలో ఒకప్పుడు బలమైన మిత్రపక్షాలుగా కొనసాగిన శివసేన, బీజేపీలు.. హనుమాన్ చాలీసా పఠనం వివాదంతో వాటి మధ్య దూరం భారీగా పెరిగింది. అధికారపక్షంలో శివసేన, ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పటికీ.. ఒక దానిపై మరోటి ఎంతో కొంత సానుకూలతగా వ్యవహరించేవి. కానీ, హనుమాన్ చాలీసా వివాదంతో ఈ రెండు పార్టీలు తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు సవాల్ చేయడంతో వారిపై యాంటీ నేషనల్ అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. హనుమాన్ చాలీసా, లౌడ్స్పీకర్లు వంటి అంశాల ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
రాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ల సారథ్యంలో ఈ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. కానీ, ఈ భేటీకి బీజేపీ హాజరు కాలేదు. ఈ సమావేశం అనంతరం హనుమానల్ చాలీసా ఘటనపై అటు అధికార పక్షం శివసేన, ఇటు ప్రతిపక్షం బీజేపీ వేర్వేరుగా విలేకరుల సమావేశాలను నిర్వహించి మాట్లాడాయి.
కొన్ిన రాజకీయ పార్టీలు లౌడ్స్పీకర్లపై డెడ్లైన్ ప్రకటించాయని, దీనిపై తాము ఒక సమావేశానికి పిలుపు ఇచ్చామని, కానీ, బీజేపీ రాలేదని హోం మంత్రి పాటిల్ అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కొనసాగడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నదని వివరించారు. లౌడ్స్పీకర్లను రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వినియోగిస్తారని తెలిపారు. లౌడ్స్పీకర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తొలగించరని పేర్కొన్నారు.
ముస్లింల అజాన్ ప్రార్థనపై గొడవలు జరిగాయని, ఒక వేళ ఈ అజాన్ ప్రార్థనలపై చర్యలు తీసుకుంటే ఇతర మత వేడుకలపైనా ఉండే పరిణామాల పరిస్థితి ఏమిటీ? హిందువులకు గణపతి, నవరాత్రి ఉత్సవాలు, ఆర్తీ, భజనల వంటి వేడకలు ఉంటాయని తెలిపారు. కాబట్టి, ఒక మత ఆచారంపై ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకోలేమని వివరించారు.
కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, అఖిల పక్ష సమావేశం కోసం బీజేపీకి ఆహ్వానం అందిందని తెలిపారు. కానీ, తాము ఆ సమావేశానికి హాజరుకాలేదని వివరించారు. కొన్ని రోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వ పాలనను చూసిన తర్వాతే అక్కడకు వెళ్లాలని భావించలేదని తెలిపారు. ఒకరు హిట్లర్ పాత్రను పోషిస్తున్నప్పుడు వారితో సమావేశంలో చర్చలు జరపడానికి బదులు పోరాటం చేయడమే ఉత్తమం అని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.
