Maharashtra: జూలై 2, 3 తేదీలలో 'మహా' అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. మెజారిటీ నిరూపణ ఆ రోజే..!
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. దక్షిణ ముంబైలోని రాజ్ భవన్లో రాత్రి 7.30 గంటల తర్వాత గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆయనతో ప్రమాణం చేయించారు. జూలై 2-3 తేదీలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏక్నాథ్ షిండే తన మెజార్టీని నిరూపించుకోనున్నారు.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఎవ్వరూ ఊహించని విధంగా.. మహా రాజకీయం మలుపు తిరిగింది. బుధవారం సాయంత్రం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తీరు చూస్తే.. మహారాష్ట్రలో మరోసారి శివసేన ఏక్నాథ్ షిండే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావించారు. కానీ, ఎవరూ భావించని విధంగా.. మహారాష్ట్ర రాజకీయాలు తారుమారయ్యాయి.
గురువారం ఉదయం నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేతో కలిసి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ముందు ప్రతిపాదన చేస్తారనే చర్చ జోరందుకుంది. ఊహించినట్లుగానే జరిగింది. మధ్యాహ్నం.. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం రాజ్భవన్కు చేరుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ ఊహించారు. కానీ, బీజేపీ అధిష్టానం అందరీ అంచనాలు తలకిందులు చేసింది.
శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అని సంచలన ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన తర్వత.. తాను మహారాష్ట్ర నూతన ప్రభుత్వంలో చేరబోనని, బయటి నుంచి సాయం చేస్తానని ఫడ్నవీస్ ప్రకటించారు. కానీ, మనసు మార్చుకుని కొత్త ప్రభుత్వంలో చేరాలని బీజేపీ అగ్రనేతల నుంచి ఫడ్నవీస్కు పలు సందేశాలు వచ్చాయి. అధిష్టానం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు అంగీకరించారు.
అనంతరం.. దక్షిణ ముంబైలోని రాజ్ భవన్లో రాత్రి 7.30 గంటలకు శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వారితో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా షిండే.. దివంగత శివసేన నాయకులు- బాల్ థాకరే, ఆనంద్ డిఘేలకు నివాళులర్పించారు. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే.. ఆయన మద్దతుదారులు ఠాక్రే, దిఘేడిఘేలను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం.. షిండే మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రను అభివృద్ధి చేయడమే లక్ష్యమనీ, అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు.
ఆ తరువాత.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సాయంత్రం మంత్రాలయలో తన మొదటి క్యాబినెట్ సమావేశాన్ని ప్రారంభించారు, మంత్రివర్గం తొలి సమావేశంలో.. ఖరీఫ్ సాగు, పంటల బీమా గురించి చర్చించారు. గత ప్రభుత్వ హయాం నుంచి ఎన్నో నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. మా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న అన్ని పథకాలను త్వరలో పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.. మహారాష్ట్ర అభివృద్ధి తమ లక్ష్యమనీ, రైతులకు, కూలీలకు పూర్తి న్యాయం చేస్తామన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ తొలి సమావేశంలో ఆరేలో మెట్రో కార్ షెడ్ నిర్మించాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్విస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ తరఫు వాదనలను కోర్టు ముందు హాజరుపరచాలని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను ఆయన ఆదేశించారు. దీనితో పాటు జలయుక్త్ శివర్ పథకాన్ని పునఃప్రారంభించే ప్రతిపాదనను త్వరలో తీసుకువస్తామని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
శని, ఆదివారాల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
మహారాష్ట్రలో శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశం జరుగనున్నది. అదే రోజు ఏక్నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కొత్త స్పీకర్ను కూడా అదే రోజు ఎన్నుకోనున్నారు.