మహారాష్ట్రకు చెందిన ఓ ఉల్లి రైతు తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు. 512 కిలోల ఉల్లిగడ్డ అమ్మడానికి 70 కిలోమీటర్ల వ్యవసాయ మార్కెట్కు వెళ్లాడని అన్నాడు. తీరా అక్కడికి వెళ్లాక తన పంట కిలో ఉల్లిగడ్డను ఒక్క రూపాయి చొప్పున కొన్నారని వివరించాడు. తనకు 512 రూపాయలు పంట విలువగా రాగా.. అందులో వాహన చార్జి, ఇతర ఖర్చులు తీసేయగా రూ. 2 మాత్రమే మిగిలాయని అన్నాడు.
ముంబయి: రాజేంద్ర తుకారాం చవాన్ అనే 58 ఏళ్ల రైతు ఉల్లి పంట పండించ్చాడు. 70 కిలోమీటర్లు ఆ ఉల్లి పంటను లోడ్ చేసుకుని తీసుకెళ్లాడు. 512 కిలోల ఉల్లిగడ్డలను అక్కడ వ్యవసాయ మార్కెట్లో అమ్మేశాడు. మొత్తం అమ్మగా అతనికి వచ్చిన డబ్బులు చూస్తే ఎవరైనా ఖంగుతింటారు. అన్ని రుసుములు కట్ చేసుకున్నాక ఆ సాగు మార్కెట్ అతనికి రూ. 2 చెక్ చేతిలో పెట్టింది.
కిలో ఉల్లిగడ్డలను రూ. 1 చొప్పున అమ్మాల్సి వచ్చింది. ‘నాకు కిలో ఉల్లిగడ్డలకు ఒక్క రూపాయి చొప్పున పడింది. మొత్తం 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మేశా. అంటే 512 రూపాయలు నాకు వచ్చాయి. కానీ, అందులో నుంచి రవాణా చార్జిలు, లోడింగ్ చార్జ్, తూకం రుసుములుగా 509.50 కట్ చేశారు’ అని రైతు రాజేంద్ర తుకారాం చవాన్ వివరించాడు. అంటూ అన్నీ పోను చవాన్ నెట్ ప్రాఫిట్ రూ. 2.49. ఈ డబ్బులను పోస్ట్ డేటెడ్ చెక్ రూపంలో అందించారు. 15 రోజుల తర్వాతే ఆ రూ. 2.49ని డబ్బుగా మార్చుకోవచ్చు. అయితే, చెక్ల డబ్బు రౌండ్ ఫిగర్లు చేస్తారు. కాబట్టి, తుకారాం చవాన్కు పై 49 పైసలు కూడా రౌండ్ ఫిగర్లో పోయి కేవలం రూ. 2 మాత్రమే చెక్ ద్వారా అందాయి. లేదూ.. ఆ 49 పైసలు కూడా కావాలనుకుంటే.. అతను నేరుగా ట్రేడర్ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. యేటికేడు సాగు వ్యవయం పెరుగుతుంటే... చేతి వచ్చే డబ్బులు మాత్రం కరిగిపోతున్నాయని ఆ రైతు బాధపడ్డాడు. ఈ 500 కిలోల ఉల్లి పంట కోసం తాను రూ. 40 వేలు ఖర్చు పెట్టానని వివరించాడు. గత మూడు నాలుగేళ్లలో సీడ్స్, ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్ల ధర దాదాపు రెట్టింపు అయిందని అన్నాడు.
Also Read: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం: ఏనుగుల దాడిలో రైతు మృతి
రాజేంద్ర తుకారాం చవాన్ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని బార్షి తాలూకా బార్గావ్ గ్రామ నివాసి.
గతేడాది కిలో ఉల్లిగడ్డకు రూ. 20 పొందానని, కానీ, ఈ సారి కేవలం రూ.1 మాత్రమే పొందానని వాపోయాడు.
