కురుక్షేత్రం మధ్యలో మహారాష్ట్ర సర్కార్.. బీజేపీ అభిమన్యుడిలా మారొద్దు: సామ్నాలో శివసేన ఎడిటోరియల్
ప్రస్తుతం మహారాష్ట్ర కురుక్షేత్ర యుద్ధం మధ్యలో ఉందని, కరోనా, అవినీతి దర్యాప్తు వంటి వాటిని ఎదుర్కొంటోందని శివసేన పేర్కొంది. ఈ మేరకు గురువారం తన అధికారిక పత్రిక ‘‘సామ్నా’’లో వ్యాసాన్ని ప్రచురించింది.
ప్రస్తుతం మహారాష్ట్ర కురుక్షేత్ర యుద్ధం మధ్యలో ఉందని, కరోనా, అవినీతి దర్యాప్తు వంటి వాటిని ఎదుర్కొంటోందని శివసేన పేర్కొంది. ఈ మేరకు గురువారం తన అధికారిక పత్రిక ‘‘సామ్నా’’లో వ్యాసాన్ని ప్రచురించింది. మహాభారత పురాణ గాథలోని సంఘటనలను ఉదహరిస్తూ ఈ వ్యాసాన్ని రాశారు. ఈ యుద్ధంలో బీజేపీ.. అభిమన్యుడిలా మారకూడదని హితవు పలికింది.
నిరంకుశవాదులతో పోరాడి మమతా బెనర్జీ గెలిచారు. మహారాష్ట్ర కూడా ఆమె దారిలోనే వెళ్లి వారితో పోరాడాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించింది. ఈ విషయాలన్నింటినీ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చెప్పే ఉంటారని శివసేన పేర్కొంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు రథసారథిగా మారి కురుక్షేత్ర యుద్ధం మధ్యలోకి తీసుకెళ్లాడని, మధ్యలో ఉండే శత్రువులను ఎదుర్కొని అధర్మాన్ని ఓడించాడని తెలిపింది. మంగళవారం సాయంత్రం శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేలు సమావేశమయ్యారని, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అనుసరించిన విధానాన్నే ఇద్దరూ అనుసరించాలని వ్యాసంలో సూచించారు.
Also Read;ఒంటరిగా పోటీ చేసుకోవచ్చు.. మాకు అభ్యంతరం లేదు: మహా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు శివసేన కౌంటర్
సమావేశం ముగిసిన తర్వాత శరద్ పవార్ మొహం వెలిగిపోయిందని, ఆయనలో సంతృప్తి కనిపించిందని పేర్కొంటూ శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయన్న వాదనలను ఖండించింది. ప్రస్తుతం సీఎం ఉద్ధవ్ కూడా మంచి విశ్వాసంతో ఉన్నారని సామ్నా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నేతలు కూడా కూటమిలో సౌకర్యవంతంగానే ఉన్నారని తెలిపింది. అందుచేత మహా వికాస్ అఘాడీ శ్రీకృష్ణుడి రథంలాగానే దూసుకుపోతోందని.. యుద్ధంలో శత్రు వినాశనం తథ్యమని ధీమా వ్యక్తం చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందన్న ఆశలతో బీజేపీ పండుగ చేసుకుంటోందని, కానీ, అది జరగదని శివసేన తేల్చి చెప్పింది. ఢిల్లీలో ప్రధాని మోడీతో ఉద్ధవ్ భేటీ కాగానే.. రాజ్ భవన్ లో మరోసారి రహస్య ప్రమాణాలు జరుగుతాయన్న పుకార్లు షికారు చేశాయని అసహనం వ్యక్తం చేసింది. ఎవరైనా అలా భావిస్తే అది రాజకీయ పగటి కలే అవుతుందని సెటైర్లు వేసింది. బీజేపీ వల్లే రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైందని, బీజేపీ మొండి వైఖరితో ఉద్ధవ్ ను ముందుకు నెట్టడం వల్లే ఆయన ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారని గుర్తుచేసింది. ఈడీ, సీబీఐని వాడుకుని మహారాష్ట్రలో రాజకీయ అస్థిరతకు బీజేపీ కుట్రలు చేస్తోందని శివసేన ఆరోపించింది