ఘోర రోడ్డు ప్రమాదం.. 16మంది దుర్మరణం
ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 16మంది అక్కడికక్కడే చనిపోయారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 16మంది దుర్మరణం పాలయ్యారు. అరటి లోడుతో వెళ్తున్న ట్రక్కు జల్గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్ ప్రాంతానికి అరటి లోడుతో ప్రయాణిస్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. జల్గావ్ జిల్లా కింగ్వాన్ సమీపంలోకి రాగానే ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 16మంది అక్కడికక్కడే చనిపోయారు. బాధితులంతా రేవర్ తెహ్ సిల్ జిల్లా అభోడా, కెహాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.