Seoni-Mundrai village: కుక్కల దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ క్ర‌మంలోనే మృతదేహాన్ని తింటున్న వీధి కుక్కలను చూసిన స్థానికులు, పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ని బాధితురాలి బంధువు ఒకరు తెలిపారు. 

Madhya Pradesh Woman Killed By Dogs: ఈ ఇటీవలి కాలంలో ప‌లు ప్రాంతాల్లో వీధి కుక్క‌ల దాడులు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌రో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక మ‌హిళ‌పై కుక్క‌లు దాడిచేసి ప్రాణాలు తీశాయి. అనంత‌రం మృత‌దేహాన్ని పీక్కుతున్నాయి. దీనిని చూసిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. కుక్కల దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ క్ర‌మంలోనే మృతదేహాన్ని తింటున్న వీధి కుక్కలను చూసిన స్థానికులు, పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ని బాధితురాలి బంధువు ఒకరు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలోని ఓ గ్రామంలో 55 ఏళ్ల మహిళను వీధి కుక్కల గుంపు దాడి చేయ‌డంతో ప్రాణాలు కోల్పోయింది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని కన్హివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండ్రాయి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మహిళ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో కుక్క‌ల దాడికి గురైన బ‌ల‌మైన‌, లోతైన గాయాలు ఉన్నట్లు తేలింది. కుక్కకాటు కారణంగానే మహిళ మృతి చెందిందని ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తెలిపారు. మృతదేహంపై ఇతర గాయాల గుర్తులు కనిపించలేదని కన్హిల్వాడ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మోనిస్ సింగ్ బైస్ తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత మ‌రిన్ని విష‌యాలు స్పష్టమవుతాయ‌ని చెప్పారు. బాధితురాలి బంధువు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 7 గంటల సమయంలో మహిళ పొలానికి వెళ్తుండగా ఓ చెట్టు చుట్టూ వీధి కుక్కల గుంపు చేరింది. అనంతరం కొందరు అటుగా వెళ్తున్నవారు శవాన్ని తింటున్న కుక్కలను గమనించి గ్రామస్థులకు, కన్హివాడ పోలీసులకు సమాచారం అందించారు.

మహిళపై జరిగిన హింసాత్మక దాడి గురించి అటవీ అధికారులకు కూడా సమాచారం అందించారు. మహిళ మాంసాన్ని తిన్న తీరు చూస్తుంటే అడవి జంతువుల దాడిగా కనిపించడం లేదని సియోనీ సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి యోగేష్ పటేల్ తెలిపారు. ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలో అడవి లేదని తెలిపారు. ఇదిలావుండగా, సియోని మునిసిపల్ కౌన్సిల్ నగరంలో వీధి కుక్కలను పట్టుకుని గ్రామ సమీపంలో వదిలివేసిందని కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల నగరంలో వీధి కుక్కలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని సియోని చీఫ్ మునిసిపల్ ఆఫీసర్ (సీఎంవో) ఆర్కే కార్వేటి తెలిపిన‌ట్టు పీటీఐ నివేదించింది.