Teesta Setalvad: తీస్తా సెతల్వాద్ 'పద్మశ్రీ'ని వెనక్కి తీసుకోండి : మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా
Teesta Setalvad: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు.
MP Home Minister Narottam Mishra: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు ఇచ్చిన 'పద్మశ్రీ' అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మంగళవారం డిమాండ్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్యాలకు సంబంధించిన కేసులో సెతల్వాద్ను గుజరాత్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆమెను జూలై 2 వరకు గుజరాత్ పోలీసుల కస్టడీకి పంపారు. ఈ క్రమంలోనే ఆమె సంబంధించిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నరోత్తమ్ మిశ్రా విలేకరులతో మాట్లాడుతూ.. తీస్తా సెతల్వాద్ వంటి వారి నుండి అవార్డును వెనక్కి తీసుకోవాలన్నారు. వ్యక్తులు, వారి ప్రవర్తన ప్రశ్నార్థకంగా మారింది.. ఆమె అరెస్టు చేయబడ్డారని తెలిపారు. 'మైనారిటీలను మభ్యపెట్టినందుకు' గత కాంగ్రెస్ ప్రభుత్వం సెతల్వాద్కు అవార్డును ప్రదానం చేసిందని ఆరోపించారు.
అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీస్తా సెతల్వాద్కు అందించింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన క్లీన్ చిట్ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు వెలువరించిన తర్వాతి రోజే గుజరాత్ పోలీసులు యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్బీ శ్రీకుమార్లను అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పోగు చేశారని గుజరాత్ పోలీసులు.. మాజీ ఐపీఎస్ అధికాారులు సంజీవ్ భట్, ఆర్బీ శ్రీకుమార్లతోపాటు యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్పైనా ఓ కేసు నమోదు చేశారు.
గుజరాత్ అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ ఎహెసాన్ జాఫ్రీ మరణించాడు. ఆయన సతీమణి జాకియా జాఫ్రీ పలు న్యాయస్థానాలను ఆశ్రయించి ఎన్నో పిటిషన్లు వేశారు. గుజరాత్ అల్లర్లు ముందస్తు ప్రణాళికగా జరిగాయని, ఆ కుట్రలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సహా సుమారు 60 మంది అధికారుల ప్రమేయం ఉన్నదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు, సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా ఈ అల్లర్లను సరిగా దర్యాప్తు చేయలేదని, కుట్రదారులకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. జాకియా జాఫ్రీ ద్వారా ఈ ముగ్గురు నిందితులు తప్పుడు సమాచారంతో కోర్టుల్లో అనేక పిటిషన్లు వేయించారని పోలీసులు ఆరోపించారు. ఈ అల్లర్లను దర్యాప్తు చేసిన సిట్ హెడ్, ఇతరులకు కూడా వీరు జాకియా జాఫ్రీ ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇప్పించారని ఆరోపణలు చేశారు. పిటిషన్ల ద్వారా ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేశారని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు, గుజరాత్ కోర్టు కూడా గుజరాత్ అల్లర్లలో కుట్ర కోణం లేదని స్పష్టం చేశాయి. ప్రధాని మోడీ సహా 64 మందికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ, ఈ క్లీన్ చిట్ను సవాల్ చేస్తూ జాకియా జాఫ్రీ పిటిషన్లు వేశారు.