Asianet News TeluguAsianet News Telugu

డిప్యూటీ కలెక్టర్ నిషా రాజీనామాకు ఆమోదం.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని మారుస్తుందా..?

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఛతర్‌పూర్ డిప్యూటీ కలెక్టర్ నిషా బాంగ్రే రాజీనామాను ఆమోదించింది. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమైంది.

Madhya Pradesh Polls Dy Collector Nisha Bangre's resignation accepted and  will congress change candiadte in amla ksm
Author
First Published Oct 24, 2023, 5:16 PM IST

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఛతర్‌పూర్ డిప్యూటీ కలెక్టర్ నిషా బాంగ్రే రాజీనామాను ఆమోదించింది. సుప్రీం కోర్టు జోక్యంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు నిషా బాంగ్రే రాజీనామాకు ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమైంది. అయితే గత కొద్దిరోజులుగా ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు  చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన సొంత జిల్లా బేతుల్‌లోని ఆమ్లా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు.

కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సుముఖంగానే కనిపించింది. కాంగ్రెస్ రెండు వేర్వేరు జాబితాలలో రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 229 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే కేవలం ఆమ్లా సీటు మాత్రమే కొంతకాలంగా పెండింగ్‌లో ఉంచింది. అయితే చివరకు అక్టోబరు 23 రాత్రి ఆమ్లా నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. మనోజ్ మాల్వేని తమ పార్టీ అభ్యర్థిగా పేర్కొంది. దీంతో  మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 230 స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది. 

అయితే ఆమ్లా నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత.. మధ్యప్రదేశ్‌లోని అధికార బీజేపీ ప్రభుత్వం నిషా బాంగ్రే రాజీనామాను ఆమోదించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆమ్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ తన అభ్యర్థిని ఆమ్లా నుండి భర్తీ చేస్తుందా? నిషా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా? తన రాజకీయ ఎంట్రీని వాయిదా వేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో నిషా రాజకీయ అరంగేట్రంపై ఆసక్తి  నెలకొంది. 

ఇక, నిషా బాంగ్రే ఈ ఏడాది జూన్‌లో తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేత కమల్ నాథ్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆమె ఆమ్లా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఆమెను పోటీకి దింపుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషా రాజీనామాను ఆమోదించక పోవడంతో.. ఆమె రాజకీయ ఎంట్రీపై ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికల తన  రాజీనామాను ఆమోదించాలనే డిమాండ్‌తో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. భోపాల్‌లోని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వెలుపల నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. 

మరోవైపు తన రాజీనామాను త్వరగా ఆమోదించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నిషా బాంగ్రే మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం కావడంతో ఆమె సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో..  ఆధారంగా అక్టోబర్ 23లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో నిషా రాజీనామా, ఆమెపై ఉన్న క్రమశిక్షణా చర్యలపై అక్టోబర్ 23లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios