లులు మాల్ వివాదాన్ని అధికారులు చాలా సీరియస్ గా తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆ వ్యాపార సంస్థకు నష్టం చేకూర్చేవిధంగా కొందరు కావాలనే ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని మరో సారి తేల్చి చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ లోని ల‌క్నో లులు మాల్ లో నెల‌కొన్న న‌మాజ్ వివాదాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకోవాల‌ని సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక‌ల్ అడ్మినిస్ట్రేటివ్ ను ఆదేశించారు. మాల్ కు ప్రజల రాకపోకలను అడ్డుకునేందుకు కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ, ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర సీనియ‌ర్ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. 

Parliament Monsoon Session2022: వాడీవేడిగా పార్ల‌మెంట్ స‌మావేశాలు.. సభ‌లో గంద‌ర‌గోళం.. 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా..

“వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న లులూ మాల్ రాజకీయ కేంద్రంగా మారిపోయింది. కొందరు వ్యక్తులు అనవసర ప్రకటనలు చేస్తున్నారు. మాల్‌ను సందర్శించే ప్రజల రాకపోకలను అడ్డుకునేందుకు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ విష‌యాన్ని లక్నో యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవాలి. ఇలాంటి ర‌గ్మ‌త‌ల‌ను స‌హించ‌కూడ‌దు. మాల్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలి ’’ అని అన్నారు. “ ప్రార్థన లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించి ట్రాఫిక్ ను అడ్డుకోరాదు. దీనికి ఎవ‌రికీ అనుమ‌తి లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలి’’ అని సీఎం మ‌రో సారి స్ప‌ష్టం చేశారు. మతపరమైన యాత్రలు, ఊరేగింపులలో కాల్పుల ఆయుధాల ప్రదర్శన లేదని అధికారులకు చెప్పిన‌ట్టు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. 

లులూ మాల్‌లోకి ప్రవేశించి హనుమాన్ చాలీసా ప‌ఠించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన ఒక రోజు త‌రువాత సీఎం యోగి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యత‌ సంతరించుకున్నాయి. ఈ అరెస్టు జ‌రిగిన కొద్దిసేప‌టికే కొంద‌రు రైట్ వింగ్ కార్య‌క‌ర్త‌లు షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించడానికి ప్ర‌య‌త్నించారు. దీంతో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ పోలీసులు క‌లుగజేసుకొని 15 మంది స‌భ్యుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక నుంచి గొడ‌వలు చేయొద్ద‌ని హెచ్చ‌రించి వారిని విడుద‌ల చేశారు. 

ఈ మాల్‌ను గత వారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈవెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత, ఎనిమిది మంది వ్యక్తులు ఆ ప్రాంగణంలో నమాజ్ చేసారు, దీని వీడియో జూలై 13 న వైరల్ అయింది. దీంతో వివాదం చెల‌రేగింది. నిందితుల‌పై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295A (మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యపూర్వక చర్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ మాల్ లో హనుమాన్ చాలీసాను పఠించడానికి రైట్ వింగ్ స‌భ్యులు సంబంధిత అధికారుల నుంచి అనుమ‌తి కోరారు. కానీ దానిని తిరస్క‌రించ‌డంతో అనుమ‌తి లేకుండానే బ‌ల‌వంతంగా మాల్ లోకి వెళ్లి హ‌నుమాన్ చాలీసా ప‌ఠించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 

బాలికపై సామూహిక అత్యాచారయత్నం.. తప్పించుకోవడానికి బిల్డింగ్ మీది నుంచి దూకి.. పరిస్థితి విషమం..

న‌మాజ్ వివాదంపై సోమ‌వారం మాల్ యాజ‌మాన్యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ‘‘ కొన్ని స్వార్థ ప్రయోజనాలు మా సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించడం బాధాకరం. మాకు ఇక్క‌డ ఉన్న అంద‌రు కార్మికులు స్థానికులే. వీరిలో 80 శాతానికి పైగా హిందువులు. మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మా ఉద్యోగులంద‌రినీ స్కిల్, మెరిట్ ఆధారంగా నియ‌మించుకున్నాం. కులం, మతం ఆధారంగా కాదు. మా స్థాపనలో మతపరమైన కార్యకలాపాలు నిర్వ హించడానికి ఎవరికీ అనుమతి లేదు. బహిరంగ ప్రదేశంలో ప్రార్థనలు, చేసేందుకు ప్రయత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం ’’ అని పేర్కొంది.