దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా ప్రాంతం చల్లబడే అవకాశం ఉందని చెప్పారు.
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలలో మంగళవారం తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని చెప్పారు.
ఈ అల్పపీడనం ప్రస్తుతం తూర్పు తీరం వైపు వాయువ్య దిశలో కదులుతోంది. ప్రస్తుత గమనం ప్రకారం ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల మధ్య దాటవచ్చని అమరావతి IMD అధికారి తెలిపారు. ఈ వాతావరణ మార్పుల వల్ల రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
ఏప్రిల్ 6 నాటికి దీనిపై ఒక స్పష్టమైన అవకాశం అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని అమరావతిలోని IMD శాస్త్రవేత్త కరుణ సాగర్ అన్నారు. తుఫానులు తూర్పు తీరానికి చేరుకోవడానికి ముందు మార్చి, ఏప్రిల్లో ఈశాన్య దిశలో తిరిగి వస్తాయని స్కైమెట్ తెలిపింది. కానీ దీనికి కొన్ని సార్లు మినహాయింపు ఉంటుందని చెప్పింది. 2019 ఏప్రిల్ 26న బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను.. మే 3న ఒడిశాలోని పూరీ మీదుగా తీరాన్ని తాకిందని పేర్కొంది.
