20ఏళ్లు సహజీవనం చేసి.. 60వ ఏట పెళ్లి..!
2001 నుంచి అదే గ్రామంలో సహజీవనం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలంతా వారిని వ్యతిరేకించినా.. ఊరి పెద్దలను ఒప్పించి కలిసి జీవిస్తున్నారు.
సహజీవనం... ఈ మాట ఈ మధ్యకాలంలో ఎక్కువగానే వినపడుతోంది. ఈ విదేశీ సంస్కృతి మనదేశానీకి పాకేసింది. చాలా మందికి పెళ్లి చేసుకోకుండానే లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్నారు. కాగా... ఉత్తరప్రదేశ్ లో ఓ జంట 20ఏళ్ల కిందటి నుంచే సహజీవనం చేస్తున్నారు. తీరా... 60ఏళ్లు వచ్చిన తర్వాత.. షష్టిపూర్తి చేసుకోవాల్సిన సమయంలో ఆ జంట పెళ్లితో ఒక్కటైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉన్నావ్ జిల్లాలోని రసూల్ పూర్ రూరీ గ్రామానికి చెందిన నరైన్ రైదాస్(60), రామ్ రతి(55) ప్రేమించుకున్నారు. 2001 నుంచి అదే గ్రామంలో సహజీవనం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలంతా వారిని వ్యతిరేకించినా.. ఊరి పెద్దలను ఒప్పించి కలిసి జీవిస్తున్నారు.
వారికి ప్రస్తుతం 13ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కారణాలేవైనా గ్రామస్థులు ఎంత అవమానించినా.. ఎందుకో ఇన్నాళ్లు వారి వివాహం చేసుకోవాలని అనుకోలేదు. ఇటీవల గ్రామ పెద్ద రమేష్ కుమార్, సామాజిక కార్యకర్త ధర్మేంద్ర బాజ్ పేయూ కలిసి నరైన్, రామ్ రతిని వివాహం చేసుకోవాలని కోరారు.
వారు, వారి కుమారుడు అవమానాల నుంచి తప్పించుకోవాలంటే పెళ్లి చేసుకోక తప్పదని ఒప్పించారు. వివాహ వేడుకకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో.. ఆ జంట వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. అలా కొడుకు సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు.