శ్రీరామునిపై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..
Jammu Kashmir: శ్రీరాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని, అందరికీ దేవుడని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. అధికారంలో ఉండటానికి బీజేపీ రాముడి పేరును మాత్రమే వాడుకుంటోందని విమర్శించారు.
Former Jammu and Kashmir CM Farooq Abdullah: శ్రీరామునిపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు హిందువులకే కాదు, అందరికీ దేవుడని వ్యాఖ్యానించారు. "రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరికీ దేవుడు. అధికారంలో ఉండటానికి బీజేపీ రాముడి పేరును మాత్రమే వాడుకుంటోంది" అని ఆయన కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారును టార్గెట్ చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఉధంపూర్ లో జరిగిన ర్యాలీలో జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ శ్రీరాముడు హిందువుల దేవుడు మాత్రమే కాదనీ, అందరికీ దేవుడని అన్నారు. మతాలకు అతీతంగా తనపై విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికీ రాముడే దేవుడని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరో సరికొత్త చర్చకు తెరలేపాయి. ఇదే సమయంలో ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ సర్కారును సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండటానికి బీజేపీ రాముడి పేరును మాత్రమే ఉపయోగిస్తున్నదని విమర్శించారు.
రాముడు అందరికీ దేవుడు..
"భగవాన్ రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరికీ దేవుడు. దయచేసి ఈ భావనను మీ మనస్సు నుండి తొలగించండి. భగవాన్ రామ్ ప్రతి ఒక్కరికీ దేవుడు.. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అమెరికన్ అయినా, రష్యన్ అయినా, ఆయనపై విశ్వాసం ఉన్న అందరికీ శ్రీరాముడు దేవుడే.. " అని పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన అన్నారు. "మేము రాముడి శిష్యులం మాత్రమే అని మీ దగ్గరకు వచ్చేవారు.. వారు (బీజేపీ) మూర్ఖులు. రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారు. వారికి (బీజేపీ) రాముడిపై ప్రేమ లేదు. అధికారంపై మాత్రమే ప్రేమ ఉంది" అంటూ బీజేపీని టార్గెట్ చేశారు.
విద్వేషపూరిత ప్రచారం ఆపండి..
అలాగే, జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు ప్రకటించినప్పుడు సామాన్యుల దృష్టిని మరల్చేందుకు రామాలయాన్ని ప్రారంభిస్తారని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల్లోకి వెళ్లి విద్వేషపూరిత ప్రచారాన్ని ఆపాలని కోరుతున్నట్టు చెప్పారు. అంతకుముందు నవంబర్ లో కూడా ఫరూక్ అబ్దుల్లా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు హిందువులకు మాత్రమే కాదు, అందరికీ దేవుడిగా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
ప్రతిపక్ష ఐక్యతకు ఆటంకం లేదు..
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరంపై ఇదివరకే పలు పార్టీల నాయకులు మాట్లాడారు. బీజేపీయేతర పార్టీల ఐక్యతపై ఆయన మాట్లాడుతూ.. 'మా ఐక్యతకు ఎలాంటి ఆటంకం ఉండదు. అది కాంగ్రెస్ అయినా, ఎన్సీ అయినా, మరేదైనా.. ప్రజల కోసం పోరాడి చచ్చిపోతాం. కానీ మేమంతా ఐక్యంగానే ఉంటాం అంటూ పేర్కొన్నారు.
ఈవీఎంలపై వ్యాఖ్యలు..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, వాటి వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలకు ముందు మతపరమైన ధృవీకరణకు వ్యతిరేకంగా ఆయన ప్రజలను హెచ్చరించారు. "ఎన్నికల సమయంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారు అనే వ్యాఖ్యలను ఎక్కువగా వాడుకుంటారని... కానీ దాని బారిన పడవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని" ప్రజలను కోరారు.