పెగాసెస్పై విపక్షాల ఆందోళన: ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయ సభల వాయిదా
ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం నాడు వాయిదా పడ్డాయి. పెగాసెస్ అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ కార్యక్రమాలకు అంతరాయం కల్గించాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనలతో మంగళవారం నాడు వాయిదా పడ్డాయి.ఇవాళ ఉదయం పార్లమెంట్ ఉభయ సభలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో విపక్షాలు తాము ఇచ్చిన వాయిదా తీర్మాణాలపై చర్చకు పట్టుబట్టాయి. పార్లమెంట్ లో పెగాసెస్ సాఫ్ట్వేర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.ఇదే విషయమై రాజ్యసభలో కూడ విపక్షాలు ఆందోళన చేశాయి. విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.
ఈ విషయమై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దేశంలోని ప్రముఖుల ఫోన్ల హ్యకింగ్ కు సంబంధించి చర్చ జరపాలని విపక్షాల ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేశారు. స్పీకర్ ఓం బిర్లా సభ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.
ఇక రాజ్యసభలో కూడ ఇదే తీరు కన్పించింది. విపక్షాలు పెగాసెస్ అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. విపక్షాల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు చైర్మెన్ వెంకయ్యనాయుడు. విపక్షాలు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు చైర్మెన్ వెంకయ్యనాయుడు.
సోమవారం నాడు కూడ పెగాసెస్ అంశంపై విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు నిర్వహించాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని సమావేశం కానున్నారు.ఈ సమావేశానికి హాజరు కావాలా వద్దా అనే విషయమై ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు విపక్షాలు సమావేశమై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.