Lok Sabha Election Phase 5 Voting: పార్లమెంట్ ఎన్నికల ఐదవ దశ ఓటింగ్ నేడు జరుగుతోంది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశ ఎన్నికల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయిస్తారు. అలాగే.. ఈ దశలో చాలా మంది ప్రముఖులు బరిలో నిలిచారు. ఇంతకీ వారెవరంటే? 

Lok Sabha Election Phase 5 Voting: 2024 సార్వత్రిక ఎన్నికల ఐదవ దశ పోలింగ్ నేడు (మే 20న) ఓటింగ్ జరగనుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనున్నది. అయితే, పార్లమెంటరీ నియోజకవర్గాన్ని బట్టి ఎన్నికలు ముగిసే సమయం భిన్నంగా ఉండవచ్చని ఎన్నికల సంఘం కూడా పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు కేంద్రమంత్రుల భవితవ్యం ఈవీఎంలలో ఖరారు కానుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


49 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. పోలింగ్, భద్రతా సిబ్బంది రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్లలో నీరు, షెడ్లు, టాయిలెట్లు, ర్యాంపులు, వాలంటీర్లు, వీల్ చైర్లు మరియు విద్యుత్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు సహా ప్రతి ఓటరు సులభంగా ఓటు వేసేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నారు. 

మహారాష్ట్రలో అత్యధిక అభ్యర్థులు

ఐదవ దశ పోలింగ్ లో 695 మంది అభ్యర్థులు తమ భవితవ్వాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో అత్యధికంగా 264 మంది అభ్యర్థులు మహారాష్ట్రకు చెందినవారు. మహారాష్ట్రలో మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 14 స్థానాల్లో 144 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. లడఖ్‌లోని ఒక స్థానానికి ఎన్నికలు జరగగా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు.

ఐదో దశలో 227 మంది కోటీశ్వరులు

ఐదో దశలో పోటీ చేస్తున్న మొత్తం 695 మంది అభ్యర్థుల అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 695 మంది అభ్యర్థులలో 159 (23%) అభ్యర్థులు కళంకితులు ఉన్నారనీ, వారిపై వివిధ కేసులు నడుస్తున్నాయని తెలిపింది. అదే సమయంలో తమను తాము లక్షాధికారులుగా ప్రకటించుకున్న అభ్యర్థులు 227 మంది ఉన్నారనీ, ఐదో దశలో ఒక్కో అభ్యర్థి సగటున రూ.3.56 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారని తెలిపింది. ఎన్సీపీ (శరద్ వర్గం)కి చెందిన ఇద్దరు అభ్యర్థులు అత్యధిక సగటున రూ.54.64 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.

12 శాతం మహిళా అభ్యర్థులు

అభ్యర్థుల వయస్సు గణాంకాలను పరిశీలిస్తే.. 207 (30 శాతం) అభ్యర్థులు 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. 384 (55 శాతం) అభ్యర్థులు 41 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. 103 (15 శాతం) అభ్యర్థులు 61 నుండి 80 సంవత్సరాల వయస్సు గలవారు. ఒక అభ్యర్థి తన వయసు 82 ఏళ్లుగా పేర్కొన్నారు. ఐదో దశ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే 695 మంది మహిళా అభ్యర్థుల్లో 82 మంది అంటే 12 శాతం మాత్రమేనని ఎన్నికల సంఘం తెలిపింది.