ఇద్దరు విద్యార్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో వైన్ షాప్ తరలించాలని ఆదేశాలు.. ఎక్కడంటే..
ఇద్దరు విద్యార్థులు వారి స్కూల్ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని మూసివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్.. మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు.
ఇద్దరు విద్యార్థులు వారి స్కూల్ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని మూసివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్.. మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. లిక్కర్ షాప్ను (Liquor shop) మూసివేసి మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఘటన తమిళనాడులో (Tamil nadu) చోటుచేసుకుంది. తమిళనాడులోని అరియలూరు జిల్లాకు చెందిన ఇలంతేంద్రల్.. 6వ తరగతి, అరివరసన్.. 4వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరు అక్కాతమ్ముళ్లు. అయితే నవంబర్ నుంచి పాఠశాలలో భౌతిక భోదన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తమ స్కూల్కు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని ఇలంతేంద్రల్, ఆమె తమ్ముడు అరివరసన్ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు.
2015లో మద్రాస్ హైకోర్టు పాఠశాలలకు 100 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదని తీర్పునిచ్చింది. అయితే కొన్ని చోట్ల ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అయితే పిల్లల ఫిర్యాదు విషయానికి వస్తే.. వారు చెప్పిన మద్యం షాప్ స్కూల్కు 100 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. పిల్లల విజ్ఞప్తి మేరకు దానిని తరలించాలని అరియలూరు కలెక్టర్ పి రమణ సరస్వతి నిర్ణయించారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (Tamil Nadu State Marketing Corporation Limited ) ఆధ్వర్యంలోని ఆ లిక్కర్ షాప్ను వేరే చోటుకి మార్చాలని సూచించారు. ‘ఆ మద్యం దుకాణం పాఠశాల నుంచి 100 మీటర్లకు అవతల ఉంది. అయితే పిల్లలు పాఠశాల తరఫున అభ్యర్థన చేసిన నేపథ్యంలో షాప్ను మూసివేసి ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చమని ఆదేశించాం’అని రమణ సరస్వతి తెలిపారు.
Also read: మహిళలు చీకటి పడిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్లొద్దు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మౌర్య
‘వాళ్లు అక్కడ తాగుతారు. అక్కడ కూర్చుని అసభ్య పదజాలం ఉపయోగిస్తారు. ఇది మాకు చాలా భయంగా ఉంది. మద్యం కారణంగా.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పనికి పంపి వారిని అడుక్కునేలా చేస్తారు. అన్ని మద్యం షాపులను మూసివేస్తే అసలు అటువంటి సమస్య ఉండదు’అని ఇలంతేంద్రల్ చెప్పింది. ఇక, కలెక్టర్కు లేఖ రాసిన పిల్లల తల్లిదండ్రులు బుక్ షాప్ నడుపుతున్నారు. ఈ పిల్లలు చేసిన ప్రయత్నాన్ని తమిళనాడులోని చాలా మంది మెచ్చుకుంటున్నారు.