స్నేహం, అసూయ, అవినీతి..: లింగాయత్ మఠాధిపతిపై లైంగిక వేధింపుల కేసు వెనక కథ అదేనా..!
కర్ణాటకలో ప్రముఖ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర కలకం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు.
కర్ణాటకలో ప్రముఖ లింగాయత్ మఠాల్లో ఒకటైన మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర కలకం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే తనపై మురుగ మఠం మాజీ నిర్వాహకుడు, అతని భార్య తనపై కుట్ర పన్నారని శివమూర్తి ఆరోపించారు. ఈ మేరకు ఇండియా టూడే రిపోర్టు చేసింది. అయితే శివమూర్తిపై అత్యాచార ఆరోపణలపై లోతుగా దృష్టి సారించగా.. స్నేహం, అసూయ, ప్రేమ, అవినీతి కథను కనుగొనట్టుగా ఇండియా టూడే రిపోర్టు చేసింది.
శివమూర్తి మురుగ శరణారు, మురుగ మఠం మాజీ నిర్వాహకుడు బసవరాజన్లు.. ఇద్దరు చిన్ననాటి స్నేహితులని.. వారు శత్రువులుగా మారారని కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు శివమూర్తి మురుగ శరణారుపై ఆగస్టు 26న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే ఆ ఆరోపణలను శివమూర్తి ఖండించారు. మురుగ మఠం మాజీ నిర్వాహకుడు ఎస్కే బసవరాజన్, అతని భార్య తనపై కుట్ర పన్నారని నిందించారు. శివమూర్తి అనుచరులు కూడా ఇదే భావనలో ఉన్నారు.
ఈ కేసు తర్వాత బసవరాజ్, అతని భార్య సౌభాగ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బసవరాజన్పై మురుగ మఠం వార్డెన్ రష్మీ.. అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో చిత్రదుర్గ రూరల్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 354(A),504,506,363, & u/s 120(B) కింద కేసు నమోదైంది.
Also Read: దేశం విడిచి వెళ్లొద్దు.. లింగాయత్ మఠాధిపతిపై లుకౌట్ నోటీసులు
బసవరాజన్, శివమూర్తికి మధ్య సంబంధం ఏమిటి..?
బసవరాజన్, శివమూర్తి ఒకే గ్రామానికి చెందినవారు. వారిద్దరూ లింగాయత్లోని జంగమారు వర్గానికి చెందినవారు. అదే సంవత్సరంలో మఠంలో చేరారు. సౌభాగ్యతో వివాహం తర్వాత.. బసవరాజన్ మఠానికి నిర్వాహకుడిగా నియమితులయ్యారు. బసవరాజన్ ఒక కమిటీని ఏర్పాటు చేసి.. మఠంలో జరిగే అన్ని లావాదేవీలకు సంతకం చేసే అధికారిగా మారారు.
మఠం నుంచి బసవరాజన్ తొలగింపు..
రాష్ట్రంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికలకు పోటీ చేసినప్పుడు బసవరాజన్ మఠం సొమ్మును దుర్వినియోగం చేశారని, ఆస్తులను విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే బసవరాజన్ను 2007లో మఠం నుంచి తొలగించారు. 2008లో రాష్ట్రంలోని చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి జేడీఎస్ టిక్కెట్పై బసవరాజ్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
ఇక, 15 ఏళ్ల తర్వాత బసవరాజన్ మళ్లీ మఠంలో చేరారు. 2022లో తిరిగి మఠం నిర్వాహకుడిగా నియమించబడ్డాడు. కానీ అతనికి గతంలో మాదిరిగా అధికారాలు లేవు. శివమూర్తి, బసవరాజన్ మరోసారి కలిసి పనిచేయడం ప్రారంభించడంతో, వారి అంతర్గత అవగాహన ఏమిటనేది మిస్టరీగా మారింది. అయితే, బసవరాజన్ వెంటనే మఠానికి వ్యతిరేకంగా మారారు. బసవరాజన్ జూలైలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేసు ఏమిటంటే..?
మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో శివమూర్తిపై కేసు నమోదైంది. ఇద్దరు మైనర్ల తరపున ఫిర్యాదు అందడంతో మైసూరు సిటీ పోలీసులు శివమూర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. మఠం నిర్వహిస్తున్న పాఠశాలలో చదువుతున్న 15, 16 ఏళ్ల ఇద్దరు బాలికలు మూడున్నరేళ్లుగా లైంగిక వేధింపులకు గురవుతున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.