రాజస్థాన్ లో పిడుగులకు18 మంది మృతి, సెల్ఫీలు దిగుతుండగా ఆరుగురు మృతి
రాజస్థాన్ లోని జైపూర్ లో గల వాచ్ టవర్ వద్ద ప్రజలు సెల్ఫీలు దిగుతుండగా పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. సహాయక బృందాలు 29 మందిని రక్షించాయి.
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. జైపూర్ కు సమీపంలోని అమీర్ ప్యాలెస్ వద్ద పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
పిడుగులు పడిన సమయంలో వాచ్ టవర్ వద్ద డజన్ల కొద్ది ఉన్నారు. దాంతో భయాందోళనకు గురైన పలువురు సమీపంలోని కొండ ప్రాంతంలోకి దుమికారు. 29 మందిని పోలీసులు, సివిల్ డిఫెన్స్ అధికారులు రక్షించారు. సెల్ఫీలు దిగుతుండగా పిడుగులు పడ్డాయి.
గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆదివారంనాడు రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దేశంలోని ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ పరిశోధన శాఖ తెలిపింది.
రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో పడిన పిడుగుల వల్ల 18 మంది మరణించారు. వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారు. రాజస్థాన్ లోని కోట, బారన్, ఝలావర్, దోల్పూర్ తదితర జిల్లాల్లో పడిన పిడుగుల వల్ల 20 మందికి పైగా గాయపడ్డారు.
జైపూల్ లోని పలు ప్రాంతాల్లో పడిన పిడగుల వల్ల 11 మంది మరమించినట్లు అధికారవర్గాలు చెప్పాయి. వారిలో కొంత మంది సెల్భీలు తీసుకుంటుండగా పిడుగులు పడి మరణించారు.
కోటలోని గార్దా గ్రామంలో రాధే బంజారా అలియాస్ బావ్లా (12), పుఖ్రాజ్ బంజారా (16), విక్రమ్ (16), అతని సోదరుడు అఖ్రాజ్ (13 పిడుగులు పడి మరణించారు. పశువుల మేతకు వెళ్లిన వారు వర్షానికి చెట్టు కిందికి చేరారు. చెట్టుపై పిడుగు పడి వారు మరణించారు
ఝలావార్ లోని లాల్గావ్ గ్రామంలో 23 ఏళ్ల పశువుల కాపరి తారా సింగ్ భీల్ పిడుగు పడి మరణించాడు. రెండు గేదెలు కూడా మరణించాయి.