సారాంశం

ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి జీవితం, కుటుంబం, జీతం వివరాలు తెలుసుకోండి

ఇటీవల 'ఆపరేషన్ సింధూర్' అనే పేరుతో జరిగిన వాయుసేన దాడుల నేపథ్యంలో, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి పేరు గట్టిగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె వ్యవహారశైలి, స్పష్టత దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. దీంతో సోఫియా ఖురేషి ఎవరు? ఆమె జీతం ఎంత? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్సాహం కలిగించాయి.గుజరాత్‌లోని వడోదరలో 1981లో జన్మించిన సోఫియా, చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ చూపింది. ఆమె బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ పూర్తి చేసి, దేశసేవ పట్ల ఆసక్తితో భారత సైన్యంలో చేరింది. 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా ఆమె లెఫ్టినెంట్ హోదాలో సైనిక జీవితాన్ని ప్రారంభించింది.

ఆమెకు కుటుంబం నుంచే సైనిక ప్రభావం ఉంది. ఆమె తాత, తండ్రి ఇద్దరూ భారత సైన్యంలో సేవలందించగా, ఆమె భర్త ప్రస్తుతం మోటరైజ్డ్ ఇన్ఫెంట్రీలో ఓ అధికారి. దీంతో ఆమెకు సైనిక జీవితంలోని ఒత్తిడులు, నిబద్ధత తెలిసినవే.సోఫియా ఖురేషి కెరీర్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల్లో పాల్గొనడం, ఈశాన్య రాష్ట్రాల్లో సహాయ కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు నిర్వహించడం వంటి అనుభవాలున్నాయి. ఇక తాజా వాయుసేన దాడుల్లో భాగంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

రూ.1లక్ష నుండి రూ.2లక్షల వరకు..

జీతం విషయానికి వస్తే, లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న అధికారుల వేతనం సుమారు రూ.1లక్ష నుండి రూ.2లక్షల మధ్య ఉంటుంది. ఇందులో ప్రాథమిక వేతనం తో పాటు, సైనిక సేవా భత్యం, కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం వంటి భాగాలు ఉంటాయి. అంతేకాదు, ప్రమాదకర మిషన్లలో పాల్గొనేవారికి ప్రత్యేక భత్యాలు కూడా కల్పిస్తారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం, సైనిక నిబంధనల ప్రకారం ఇస్తారు.

ఈ విధంగా, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి కేవలం ఓ అధికారి మాత్రమే కాదు, దేశభక్తి, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. శివంగిలా శత్రుదేశాల మీద విరుచుకుపడినఆమె కథ దేశంలో ఎందరో యువతులకు ప్రేరణగా నిలుస్తోంది.