బెళగావిలో మరోసారి చిరుత కలకలం.. ముందుజాగ్రత్తగా 22స్కూళ్లకు సెలవు...
బెళగావిలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. మూడు వారాల క్రితం అదృశ్యమైన చిరుత మరోసారి కనిపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
కర్ణాటక : కర్ణాటకలోని బెలగావి నగరంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. గతంలో ఆ ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు అదృశ్యమైన చిరుతపులి ఉన్నట్టుండి ఈరోజు బెలగావి గోల్ఫ్ కోర్సు వద్ద రెండు సార్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 5న ఓ కార్మికుడిపై దాడి చేసి అదృశ్యమయింది చిరుత పులి. అప్పటి నుంచి దాని కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ ఈ బృందాలకు చిరుతపులి దొరకలేదు. దాదాపు మూడు వారాల తర్వాత సోమవారం ఉదయం రోడ్డు దాటుతూ బస్సు డ్రైవర్లకు కనిపించింది.
మిలటరీ క్యాంప్ సమీపంలో చిరుత క్లబ్ రోడ్డు దాటుతున్న దృశ్యాలను బస్సు డ్రైవర్ తన ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కలప్రాంతాల్లోని 29 పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. అప్పటికే కొన్ని పాఠశాలలకు విద్యార్థులు రావడంతో వారిని తీసుకు వెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే, చిరుతపులి కాలిబాటపై దాదాపు 200 మీటర్ల మేర పరుగులు పెట్టినట్లుగా గుర్తించారు.
పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు, క్లబ్బు రోడ్డుపై కాపు కాచిన అటవీశాఖ అధికారులు గోల్ఫ్ కోర్టులో చిరుత కోసం గాలిస్తుండగా… అప్పుడే అది మరోసారి రోడ్డు దాటినట్లుగా గుర్తించారు. గోల్డ్ కోర్టు నుంచి పారిపోయిన చిరుత మిలటరీ క్యాంపస్ లోని పొదలవైపు వెళ్లినట్లుగా గుర్తించారు. అయితే, ఈ పులిని షూట్ చేసేందుకు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే తాము షూట్ చేసే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిల్ బెనాకే అక్కడికి రాగా.. ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఆ విషయంపై ముఖ్యమంత్రి సహాయం కోరుతామని అన్నారు.