నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిమీద దారుణమైన దాడి.. చోద్యం చూస్తున్న జనం.. వీడియో వైరల్...
కర్నాటకలో దారుణమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా న్యాయవాదిని ఓ వ్యక్తి తీవ్రంగా కొడుతూ, కడుపులో తంతూ దాడి చేశాడు. అయితే ఇదంతా అక్కడున్నవారు చోద్యం చూస్తున్నారే తప్పితే ఆపే ప్రయత్నం చేయలేదు.
కర్ణాటక : Karnatakaలోని బాగల్కోట్ జిల్లా వినాయక్ నగర్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఓ మహిళపై దారుణమైన attack జరిగింది. ఆమెను పలుమార్లు చెప్పుతో కొట్టి, తన్నిన దారుణం చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు లాయర్ కావడం గమనార్హం. లాయర్ అయిన సంగీత అనే మహిళపై ఆమె పొరుగింటి మహంతేష్ దాడి చేశాడు.
ఈ సంఘటనను సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంతేష్ తీవ్ర ఆగ్రహంతో, బలవంతంగా మహిళపై దాడి చేసినట్లు కనిపిస్తుంది. ఆమెను చెంపదెబ్బలు కొడుతూ, తంతూ దారుణంగా దాడి చేశాడు. ఈ దెబ్బలకు ఆమె వెనక్కి పడుపోతూ.. ప్లాస్టిక్ కుర్చీ తీసుకుంటుండగా ఆ వ్యక్తి మళ్లీ ఆమెను తన్నాడు. కడుపులో తీవ్రంగా తంతుంటూ పక్కనుంచి ఎవరో అరవడం వినిపిస్తుంది.
ఈ దాడి సమయంలో చుట్టుపక్కల చాలా మందే జనం కనిపిస్తున్నప్పటికీ.. ఎవ్వరూ దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. మరికొందరు వీడియోలు తీశారు. చుట్టుపక్కల జనం ఉన్నప్పటికీ నిర్దాక్షిణ్యంగా కొట్టుకుంటున్న మహిళను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఈ దాడికి కారణం వీరిద్దరి మధ్య ఉన్న గొడవలే అని తెలుస్తోంది.
సివిల్ వివాదం కేసులో వ్యక్తిగత శత్రుత్వం కారణంగా మంతేష్ మహిళపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళా న్యాయవాది తనను చిత్రహింసలకు గురిచేశిందని, వేధించిందని నిందితుడు ఆరోపించాడు. వీరిద్దరు గతంలో కూడా పలుమార్లు గొడవ పడ్డారని సమాచారం.