ఆర్ధిక మాంద్యం: మహిళా కార్ల డీలర్ ఆత్మహత్య
తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్గా వ్యవహరిస్తున్న లాన్సన్ సంస్థ ఛైర్మన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రీటా లంకలింగం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చెన్నైలో మహిళా పారిశ్రామిక వేత్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్గా వ్యవహరిస్తున్న లాన్సన్ సంస్థ ఛైర్మన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రీటా లంకలింగం నుంగంబాక్కం కొఠారీ రోడ్లో నివసిస్తున్నారు.
బుధవారం అర్ధరాత్రి తన ఇంటికి చేరుకున్న రీటా ఎప్పటిలాగే తన గదిలో నిద్రపోయారు. గురువారం ఉదయం 11 గంటల వరకు ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో.. ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రీటా ఇంటికి చేరుకున్న పోలీసులు... తలుపులు పగులగొట్టి చూడగా ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థపై ఆర్ధిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. ఈ కారణంగా కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు రావడం వల్లే రీటా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
లేదంటే రీటాకు భర్తతో గొడవలున్నాయా.. లేక బిజినెస్లో నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారా..? అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.