భారతదేశంలో వర్షాకాలం ఆరంభంలోనే ఘోరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వానలకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి… తాజాగా కొండచరియలు విరిగిపడి ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

Southeast Floods : ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి... దీంతో ఇప్పటికే భారీ ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా సంభవించింది. తాజాగా సిక్కింలో మరో విషాదం ఘటన చోటుచేసుకుంది... ఈ వర్షాల కారణంగా భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలోని ఛటేన్ ప్రాంతంలో మిలిటరీ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడ్డాయి.. దీంతో ముగ్గురు జవాన్లు మరణించగా మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదాన్ని రక్షణ శాఖ ధ్రువీకరించింది.

గత రెండుమూడు రోజులనుండి ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా నిన్న(ఆదివారం) కూడా సిక్కింలో భారీ వర్షం కురిసింది. దీంతో రాత్రి 7గంటల సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగి ఆర్మీ క్యాంప్ పై పడ్డాయి. దీంతో మొత్తం తొమ్మిదిమంది ప్రమాదానికి గురయ్యారు.. వీరిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. మిగతావారి ఆఛూకీ తెలియడంలేదు... వారికోసం గాలిస్తున్నారు.

ఈ ప్రమాదంగురించి తెలిసిన వెంటనే సిక్కిం విపత్తు నిర్వహణ విభాగం, స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది  ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే మరణించిన జవాన్ల మృతదేహాలను గుర్తించారు.. గల్లంతయిన వారికోసం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం నుండి ఓ నలుగురు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోందని సిక్కిం అధికారులు వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో వర్షభీభత్సం... ఇప్పటికే 25 మంది మృతి

భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి, వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి... వరదనీరు జనావాసాలను ముంచెత్తుతోంది. దీంతో అసలు ఊహకందని స్థాయిలో ఆస్తి నష్టం జరుగుతోంది.. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది. ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కలిపి 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అస్సాం రాజధాని గౌహతిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా మరో ఇద్దరు మట్టిలో కూరుకుపోయి మరణించారు. ఇక గోలాఘాట్, లక్ష్మీపూర్ జిల్లాలలో మరో ముగ్గురు వరదల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రయాణికులతో వెళుతున్న ఓ వాహనం వరదనీటిలో కొట్టుకుపోయింది... ఇందులోని ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో మరో ఇద్దరు కూడా ఈ వర్షాల కారణంగా మరణించారు.

ఇలా గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాల్లో 24 మంది ఈ వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు విడిచారని అధికారులు చెబుతున్నారు. ఇక మూగజీవుల మరణాలకు లెక్కేలేదని అంటున్నారు.

ఈరోజు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి

ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయి... వీటికితోడు బంగ్లాదేశ్-షిల్లాంగ్ సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇవాళ(సోమవారం) కూడా కొనసాగుతాయని ఐఎండి హెచ్చరిస్తోంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీచేసారు. మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం వంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిన్న(జూన్ 1 ఆదివారం) అస్సాంలో రికార్డు వర్షపాతం నమోదయ్యింది... సిల్చార్ లో ఏకంగా 415 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 1893 తర్వాత ఒకేరోజు ఈస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది…దీంతో 132 ఏళ్లనాటి రికార్డు బద్దలయ్యింది. 1893 లో కేవలం 290 మి.మీల వర్షపాతమే రికార్డు... కానీ ఇప్పుడు అంతకు డబుల్ వర్షం కురిసింది.

ఈ కుండపోత వర్షాల కారణంగా లక్షలాదిమంది ఇబ్బంది పడుతున్నారు... చాలామంది ఇండ్లు నీటమునిగి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. ఇక రైతుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వరదలు వచ్చాయంటే ముందుగా నష్టపోయేది రైతులే. తాజాగా ఈశాన్య రాష్ట్రాల రైతులు కూడా లక్షల ఎకరాల్లో పంట నీటమునిగి తీవ్రంగా నష్టపోయారు.