Lalu Prasad Yadav Health Update:  ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో అత‌న్ని ఎయిర్ అంబులెన్సులో పాట్నా నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. గ‌త కొద్ది రోజులుగా  లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.   

Lalu Prasad Yadav Health Update: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయ‌న‌ను ఎయిర్ అంబులెన్స్ లో  పాట్నా నుంచి ఢిల్లీ AIIMS కు తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కార్డియో న్యూరో సైన్స్ సెంటర్‌లో చేర్చారు. రాత్రి 10 గంటలకు ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీ చేరుకున్నారు. అంతకుముందు లాలూ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఢిల్లీ చేరుకున్నారు. లాలూ యాదవ్ గతంలో పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఐసీయూలో చేర్చారు.

ఈ నేపథ్యంలో బుధవారం లాలూ ఆరోగ్యం మరోసారి విషమించడంతో..  మెరుగైన వైద్యం కోసం ఆయ‌న‌ను హుటాహుటిన రాత్రి ఢిల్లీకి తరలించారు. ఆయ‌న‌తో పాటు కూతురు, రాజ్యసభ సభ్యురాలైన డా మిశా భారతి,  డాక్టర్ల బృందం వెంట వెళ్లింది. అంతకంటే కొన్ని గంటల ముందే.. లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి, చిన్న కొడుకు తేజస్వి యాదవ్ ఢిల్లీకి వెళ్లి అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. 

మ‌రోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున‌ ప్రార్థనలు చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ యోగక్షేమాలు తెలుసుకునేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సమయంలో, నితీష్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, పెద్ద కుమారుడు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్, చిన్న కుమారుడు బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, కుమార్తె మిసా భారతితో కూడా మాట్లాడారు. ఆరోగ్యం క్షీణించిందని తెలిసిన వెంటనే మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నామని నితీశ్ కుమార్ తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు.
 
లాలూ ప్రసాద్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం ఇప్పటికే మెరుగ్గా ఉందని, ఇప్పుడు ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతారని తెలిపారు. చికిత్స (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్) కోసం సింగపూర్‌కు తీసుకెళ్లాలి కానీ, ఇప్పుడు ఫ్రాక్చర్ అయ్యిందని, ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఢిల్లీలోని వైద్యుల అభిప్రాయం ఉంటే వారిని కూడా చికిత్స నిమిత్తం బయటకు తీసుకెళ్తాం. కుటుంబ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. లాలూ ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్నారు.