దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్, ఇక ఇంటికి...
దాణా కుంభకోణం కేసులో ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించడంతో ఇంటికి వెళ్లడానికి అడ్డంకులు తొలగిపోయాయి.
రాయపూర్: రాష్ట్రీయ జనతాదళ్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరైంది. దాణా కుంభకోణం కేసులో జార్ఖండ్ హైకోర్టు శనివారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా ట్రెజరీ కేసులో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు.
ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు విత్ డ్రా చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బీహార్ దాణా కుంభకోణానికి సంబంధించిన మొత్తం నాలుగు కేసుల్లో మూడు కేసుల్లో ఇప్పటికే ఆయనకు బెయిల్ మంజూరైంది. దుమ్కా కేసులో కూడా బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లే అవకాశం దక్కింది.
ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. 72 ఏళ్ల వయస్సు గల లాలూ ప్రసాద్ యాదవ్ ఖైదీగా ఉన్న చాలా కాలం జార్ఖండ్ లోని రాజేంద్ర మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలోనే ఉన్నారు ఆరోగ్యం విషమించడంతో జనవరిలో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు.