తేజస్వీ యాదవ్ పెళ్లిపై దుమారం : పేరు మార్చుకున్న లాలూ కొత్త కోడలు.. ఏంటంటే..?
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం ఇటీవల స్నేహితురాలు రేచల్ గోడిన్హోతో జరిగిన సంగతి తెలిసిందే. యాదవ సామాజికవర్గానికి చెందిన తేజస్వి క్రైస్తవ మతానికి చెందిన రేచల్ గోడిన్హోను పెళ్లాడటం బీహార్ రాజకీయాల్లో కలకలం రేపింది
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం ఇటీవల స్నేహితురాలు రేచల్ గోడిన్హోతో జరిగిన సంగతి తెలిసిందే. యాదవ సామాజికవర్గానికి చెందిన తేజస్వి క్రైస్తవ మతానికి చెందిన రేచల్ గోడిన్హోను పెళ్లాడటం బీహార్ రాజకీయాల్లో కలకలం రేపింది. బంధువులు కూడా తేజస్వీ వివాహాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేచల్ తన పేరును స్వచ్ఛంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆమె పేరును రాజ్యశ్రీగా మార్చామని, ఈ పేరును తన తండ్రి సూచించారని రేచల్ చెప్పారు.
ఇక తమ వివాహ వేడుకను కేవలం తను, తన భార్య కుటుంబసభ్యుల మధ్యే నిర్వహించుకోవాలని తాము నిర్ణయించుకున్నామని తేజస్వి వెల్లడించారు. అప్పుడే ఇరు కుటుంబాలకు చెందిన వారు ఆత్మీయంగా మాట్లాడుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులు పెళ్లికి వస్తే... వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తేజస్వీ అన్నారు. అతిథుల సంఖ్యను తగ్గించడానికి కరోనా కూడా ఒక కారణమని ఆయన వెల్లడించారు.
ALso read:మతాంతర వివాహం: లాలూ పరువు మంటగలిపావుగా, తేజస్వీ యాదవ్పై మేనమామ ఆగ్రహం
అయితే తేజశ్విపై ఆయన మేనమామ సాధు యాదవ్ (sadhu yadav) మండిపడ్డారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) పరువు, ప్రతిష్ఠను ఆయన కుమారుడు తేజశ్వి మంటకలిపాడని సాధు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాంతర వివాహం చేసుకోవడం ద్వారా లాలూ ప్రతిష్ఠను తేజశ్వి దెబ్బతీశాడని సాధు యాదవ్ మండిపడ్డారు. బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా పిలిపించుకునే అర్హత తేజశ్వికి లేదని అన్నారు.
పార్టీలో, కుటుంబంలో ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని సాధు యాదవ్ విమర్శించారు. దీనిని ఇకపై కొనసాగనివ్వబోమని... ఆయనకు తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ పెళ్లికి సాధు యాదవ్ ని తేజశ్వి ఆహ్వానించలేదు. ఇక,లాలూ ప్రసాద్, రబ్రీదేవీల 9మంది సంతానంలో తేజస్వీ యాదవ్ చివరి వ్యక్తి. ఆయనకు ఏడుగురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉండగా వారందరికీ వివాహాలు జరిగాయి.