Lakhimpur Kheri: సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థపై ఆశను పునరుద్ధరించింది: ఎస్కేఎం
Lakhimpur Kheri: సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థపై ఆశను పునరుద్ధరించిందని సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్కేఎం) పేర్కొంది. రైతుల మరణాలకు కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై హర్షంవ్యక్తం చేస్తూ.. ఎస్కేఎం పై వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
Lakhimpur Kheri: లఖింపూర్ ఖేరీ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోను బెయిల్ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థపై ఆశను పునరుద్ధరించిందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. లఖింపూర్ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్వాగతించింది. కోర్టు ఆదేశాలు దేశంలోని న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించేలా ఉన్నదని పేర్కొన్నది. అంతకుముందు రోజు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో 2021 అక్టోబర్ లో జరిగిన సంఘటనకు సంబంధించి మిశ్రా బెయిల్ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఇందులో అతనికి చెందిన వాహనం నిరసన తెలిపిన రైతులతో సహా పలువురిని ఢీ కొట్టింది. వారిపై నుంచి వేగంగా దూసుకుపోవడంతో ఈ ఘటన నేపథ్యంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కూడా ఎస్కేఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేయడాన్ని ఎస్కేఎం స్వాగతించింది. సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వు తరువాత.. నిందితుడు ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా తేని తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించాలి అని SKM డిమాండ్ చేసింది. అజయ్ మిశ్రా తేని మంత్రి పదవి నుంచి తొలగించకపోతే.. మే మొదటి వారంలో సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ సమావేశాన్ని నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగుతుందని ఓ ప్రకటనలో హెచ్చరించింది.
"లఖింపూర్ ఖేరీ కేసులో చిక్కుకున్న రైతులకు న్యాయం చేయాలి. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారికి రక్షణ కల్పించాలి" అని ఎస్కేఎం పేర్కొంది. కోర్టు ఉత్తర్వులతో రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆశ కలుగుతున్నదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. బాధిత రైతు కుటుంబాలకు పరిహారంతో పాటు రక్షణ కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“అక్టోబర్ 3న జరిగిన ఈ దారుణ హత్యలో నేరస్తులను రక్షించేందుకు మొదటి నుంచీ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.. సుప్రీంకోర్టు పదే పదే జోక్యం చేసుకున్న తర్వాతనే న్యాయం జరిగింది. ఈ ఉత్తర్వు తర్వాత కేంద్ర మంత్రివర్గంలో కొనసాగేందుకు తేనీకి ఎలాంటి సమర్థన మిగల్లేదు’’ అని రైతులు పేర్కొంటున్నారు.
"ఈ మారణకాండకు ముందు.. సెప్టెంబర్ 26న మంత్రి అజయ్ మిశ్రా తేని రైతులను బహిరంగంగా బెదిరించారు, కానీ ఇప్పటి వరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు" అని SKM పేర్కొంది. న్యాయమూర్తి పర్యవేక్షణలో పని చేస్తున్న సిట్ రాతపూర్వక సిఫార్సు తర్వాత కూడా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయలేదు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి" అని ఎస్కేఎం నొక్కి చెప్పింది. కాగా, గతేడాది 3న రైతులు కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. లఖింపూర్ ఖేరీలో వందల మంది రైతుల శాంతియుత నిరసన పైకి వెనుక నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కాన్వాయ్.. వేగంగా దూసుకువచ్చింది. కాన్వాయ్ లో ఆయన తనకుడు ఆశిష్ మిశ్రా ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో రైతులతో పాటు జర్నలిస్టు.. ఓ డ్రైవరు కూడా ఉన్నారు. మొదట ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ దర్యాప్తు కొనసాగించడంపై అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందని స్పష్టం తెలుస్తోంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన న్యాయస్థానం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.