గర్బిణికి డెలివరీ చేసిన మహిళా ఎస్ఐ... ఫోన్ మాట్లాడుతూ..
ఆ రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్ ఆ గర్భిణికి డెలివరీ చేసేందుకు ముందుకు వచ్చారు.
ఓ మహిళా ఎస్ఐ డాక్టర్ అవతారం ఎత్తింది. అర్థరాత్రి సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆ ఎస్ఐ అన్నీ తానైంది. సమయానికి ఆమెకు వైద్యం చేయడానికి డాక్టర్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో.. ఈ మహిళా ఎస్ఐ వైద్యురాలిగా మారింది. డాక్టర్ తో ఫోన్ లో మాట్లాడుతూ.. వైద్యం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని రావత్పురా జిల్లా బింద్లో నివసిస్తున్న బాద్షా, గోవా ఎక్స్ప్రెస్లో తన భార్య పూజ (19) తో కలిసి దౌండ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్నారు. ఇంతలో పూజకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో వారు ఝాన్సీ రైల్వే స్టేషన్లో దిగిపోయారు.
ఆ రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్ ఆ గర్భిణికి డెలివరీ చేసేందుకు ముందుకు వచ్చారు.
పరిస్థితిని గమనించిన మహిళా ఎస్ఐ రాజకుమారి గుర్జర్ తన స్నేహితురాలైన డాక్టర్ డాక్టర్ నీలు కసోటియాకు ఫోను చేశారు. ఆ వైద్యురాలు ఫోనులో సూచనలు చేస్తుండగా, ఎస్ఐ రాజకుమారి ఆ గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేశారు.
వెంటనే అంబులెన్స్ను పిలిపించి తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్నవారంతా ఆ మహిళా ఎస్ఐని అభినందనలతో ముంచెత్తుతున్నారు.