కేజ్రీవాల్కు ఊరట: లెఫ్టినెంట్ గవర్నర్ దూకుడుకు సుప్రీం కళ్లెం
సుప్రీంలో కేజ్రీవాల్కు ఊరట: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు దెబ్బ
న్యూఢిల్లీ: ప్రభుత్వం సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేయాలని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం సూచించింది. ఢిల్లీ పరిపాలన అధికారాలపై ఆప్ ప్రభుత్వం పలు పిటిషన్లను కోర్టులో దాఖలు చేసింది. దీనిపై బుధవారం నాడు విస్తృత ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
పాలనపరమైన అధికారం ఎవరికి ఉంటుందనే విషయాలపై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం నాడు తీర్పును వెలువరించింది.
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య చోటు చేసుకొన్న వివాదాల నేపథ్యంలో ఆప్ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్ది దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయి హోదా ఇవ్వడం కుదరదని సుప్రీం తేల్చి చెప్పేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ లు సంయుక్తంగా పనిచేయాల్సి ఉందన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం తమ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదని విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఈ విధానాలపై ఢిల్లీ ప్రభుత్వం సమాచారం ఇస్తే సరిపోతోందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.