KS Eshwarappa: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి కేసులో బీజేపీ నేత ఈశ్వరప్పకు పోలీసుల క్లీన్ చిట్ ఇచ్చారు. ఈశ్వరప్పతో పాటు ఆయనతో సంబంధం ఉన్నవారు సంతోష్ పాటిల్ను బెదిరించినట్టు రుజువులు లేవని పేర్కొంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టుకు పోలీసులు ‘బి’ రిపోర్టు సమర్పించారు.
Karnataka: కర్నాటకలో సంచలనం సృష్టించి కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి కేసులు రాష్ట్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు కేఎస్ ఈశ్వరప్పకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. బెళగావి కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి కేసు దర్యాప్తునకు సంబంధించి ఉడిపి పోలీసులు ‘బి’ రిపోర్ట్లో ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఈశ్వరప్పతో పాటు ఆయనతో సంబంధం ఉన్నవారు సంతోష్ పాటిల్ను బెదిరించినట్టు రుజువులు లేవని పేర్కొంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టుకు పోలీసులు ‘బి’ రిపోర్టు సమర్పించారు. దీనిపై బుధవారం ఈశ్వరప్ప స్పందిస్తూ.. 'దర్యాప్తులో నేను క్లీన్గా బయటకు వస్తానని నాకు నమ్మకం ఉంది. సంతోష్ పాటిల్ తో నాకు ఎలాంటి సంబంధాలు లేవని పదే పదే చెప్పాను. అతని మరణంపై నాపై ఆరోపణలు వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు, నా మాటలు సరైనవని నిరూపించబడినందుకు నేను సంతోషంగా.. సంతృప్తిగా ఉన్నాను" అని ఈశ్వరప్ప మీడియతో అన్నారు.
కాగా, కర్నాటక ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులు రాష్ట్రంలో కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి వద్ద నుంచి పెద్దమొత్తంలో కమీషన్ కోరుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు.. ఆ సమయంలో మంత్రిగా ఉన్న కేఎస్ ఈశ్వరప్ప, ఆయన అనుచరులు తనను బెదిరిస్తున్నారని కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 12న, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసినందుకు తనకు 40 శాతం కమీషన్ ఇవ్వాలనీ, లేకుంటే నిధుల మంజారు జరగదని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన మంత్రిపై ఆరోపణలు చేస్తూ.. తన స్నేహితులతో పాటు పలువురికి సందేశం పంపారు. ఈ విషయంలో రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపింది. దీంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్న కేఎస్ ఈశ్వరప్ప అనేక పరిణామాల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు.
అయితే, ఈ కేసులో దర్యాప్తు సరిగ్గా జరగలేదని కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తును ప్రత్యేక ఎజెన్సీలకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కేఎస్ ఈశ్వరప్ప తన డబ్బు, రాజకీయ పలుకుబడితో దర్యాప్తును తప్పుదొవ పట్టించడంతో పాటు తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. కాగా, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యపై విచారణ ప్రారంభమైనప్పటికీ, ఈశ్వరప్పను ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదని మీడియా రిపోర్టుల సమాచారం. ఈకేసులో ఈశ్వరప్పకు ఎలాంటి క్లిన్ చిల్ ఇస్తూ.. ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టుకు పోలీసులు సమర్పించిన ‘బి’ రిపోర్టులో సీసీటీవీ విజువల్స్, ఆడియో క్లిప్పింగ్స్, పాటిల్ బ్యాంక్ స్టేట్మెంట్లు, కాంట్రాక్ట్ వివరాలు, అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల వాంగ్మూలాలు ఉన్నట్టు సమాచారం.
కాగా, రూ. 4 కోట్ల ప్రాజెక్ట్ కోసం గ్రామీణాభివృద్ధి అండ్ పంచాయత్ రాజ్ శాఖల మంత్రిగా కేఎస్ ఈశ్వరప్ప కొనసాగుతున్న సమయంలో ఆయన తనకు 40 శాతం కమీషన్ ఇవ్వాలని పేర్కొన్నట్టు సంతోష్ పాటిల్ తన స్నేహితులు సహా పలువురికి మెసేజ్ చేశారు. ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తన భార్య ఆభరణాలను కూడా అమ్మి పూర్తి చేశానని, అయితే 18 నెలల తర్వాత కూడా ఎలాంటి చెల్లింపులు జరగలేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఈశ్వరప్ప.. ₹ 4 కోట్ల బిల్లును క్లియర్ చేయడానికి 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని సంతోష్ పాటిల్ ఆరోపించారు.
