Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న కారులో విద్యార్థుల హత్య.. ప్రధాన నిందితుడి అరెస్ట్...

కోల్‌కతా టీనేజ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సత్యేంద్ర చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హౌరా రైల్వే స్టేషన్‌లో తప్పించుకోవడానికి ప్రయత్నించగా ప్రత్యేక బృందం అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Kolkata Schoolboys Murder Mastermind Caught At Station
Author
First Published Sep 9, 2022, 12:54 PM IST

కోల్‌కతా : కోల్‌కతాలో కలకలం రేపిన ఇద్దరు 17 ఏళ్ల స్కూలు విద్యార్థుల కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడిని శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జంట హత్యల కేసులో ప్రధాన సూత్రధారి సత్యేంద్ర చౌదరిని హౌరా రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక బృందం అరెస్టు చేసినట్లు బిధాన్‌నగర్ పోలీస్ కమిషనరేట్ సీనియర్ అధికారి తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలోనే తాము అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి సత్యేంద్ర చౌదరికి సహకరించిన నలుగురు వ్యక్తులను ఇంతకు ముందే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6న సిర్‌హత్‌లోని శవాగారంలో ఉన్న గుర్తుతెలియని మృతదేహాలు.. అంతకు 15 రోజుల క్రితం తప్పిపోయిన పిల్లలవని తేలడంతో ఈ కిడ్నాప్ అండ్ మిస్సింగ్ కేసు కొలిక్కి వచ్చింది. 

వారిద్దరినీ కిడ్నాప్ చేసి, ఆ తరువాత గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని మలంచ ప్రాంతంలో స్థానిక పోలీసులు బసంతి హైవేపై మృతదేహాలను గుర్తించారు. వీటిని గుర్తు తెలియని మృతదేహాలుగా నమోదు చేసి మార్చురీకి తరలించారు. అయితే ఇవి తప్పిపోయిన పిల్లలవిగా తేలడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాగుయాటి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, మరొక అధికారిని సస్పెండ్ చేసింది. ఈ కేసును బిధాన్‌నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాగుయాటి పీఎస్ నుంచి రాష్ట్ర సీఐడీకి అప్పగించినట్లు అధికారి తెలిపారు.

కదులుతున్న కారులో గొంతునులిమి ఇద్దరు విద్యార్థుల హత్య.. మృతదేహాలను కాలువలోకి విసిరేసి...

కాగా, రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన ఇద్దరు  పాఠశాల విద్యార్థులు కోల్‌కతా సమీపంలోని ఓ రోడ్డు పక్కన గుంతలో శవాలుగా కనిపించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు సత్యేంద్ర చౌదరి సహా మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది. కేసు వివరాల్లోకి వెడితే.. ఆగస్ట్ 22న ఇద్దరు బాలురు కిడ్నాప్ అయ్యారు. అయితే దీనిమీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అనుమానితులను విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

పాఠశాల విద్యార్థులు ఇద్దర్ని కిడ్నాప్ చేసిన వెంటనే హత్య చేశారని.. వారిని కదులుతున్న కారులోనే గొంతు నులిమి చంపేసి.. ఆ తరువాత పక్కనే ఉన్న కాలువలో పడవేసినట్లు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరు వెల్లడించాడు. ఈ సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలోని బగుయిహతి ప్రాంతం నుంచి అతాను డే, అభిషేక్ నస్కర్‌ అనే ఇద్దరు విద్యార్థులను నిందితులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత అతాను కుటుంబ సభ్యులకు కిడ్నాప్ చేశామని, డబ్బులు కావాలంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే, పోలీసుల కథనం ప్రకారం, మరో చిన్నారి అభిషేక్ ను సాక్ష్యం లేకుండా చేయాలనే హత్య చేశారని తెలుస్తోంది. అయితే, పోలీసులు సరైన టైంలో సరిగా స్పందించలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని పోలీసులు కొట్టిపారేశారు.

వారు మాట్లాడుతూ "మా దర్యాప్తును మేం అన్ని కోణాల్లో ప్రారంభించాం. ఏ చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టలేదు. కిడ్నాపర్లు కాల్స్ చేసినప్పటికీ బాధిత కుటుంబసభ్యులు వారితో సరిగా రిలేషన్ మెయింటేన్ చేయలేకపోయారు. ఈ కాల్స్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు మేము కూడా అలర్ట్ గా ఉన్నాం. జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నాం" అని బిధాన్‌నగర్ పోలీసు బిశ్వజిత్ ఘోష్ తెలిపారు.

అరెస్టయిన నిందితుల్లో ఒకరు హత్య చేసినట్లు ఒప్పుకునే వరకు ఇద్దరు బాలురు చనిపోయారని తాము ఊహించలేదని పోలీసులు తెలిపారు. "మా విచారణలో భాగంగా అభిజిత్ బోస్‌ను అరెస్టు చేయడంతో కేసులో పురోగతి సాధ్యమయ్యింది. విచారణలో బోస్ మొత్తం చెప్పేశాడు. 22వ తేదీన సత్యేంద్ర, మరో ఇద్దరు ముగ్గురితో కలిసి కారులో వెడుతూ రాత్రి 8-10 గంటల మధ్య బసంతి హైవేపై పిల్లలను గొంతు కోసి చంపినట్లు ఒప్పుకున్నాడు.ఆ తరువాత హైవేపై రెండు వేర్వేరు ప్రదేశాల్లో రెండు మృతదేహాలను పడేసినట్లు అంగీకరించారు" అని ఘోష్ చెప్పారు.

చనిపోయిన అతాను, ప్రధాన నిందితుడు సత్యేంద్ర చౌదరి అంతకుముందే వీరు ఒకరికొకరు తెలుసు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు కోపంతో సత్యేంద్ర ఇంటిని ధ్వంసం చేశారు. ఇక తమ ఫిర్యాదుపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించలేదని కుటుంబీకులు చెబుతున్నారు. సహాయం కోరేందుకు తాను ముఖ్యమంత్రి నివాసానికి కూడా వెళ్లానని, అయితే భద్రతా సిబ్బంది అనుమతించలేదని అతాను డే తల్లి పేర్కొంది. కాగా, తమకు ఈ సమాచారం అందిన వెంటనే, గుర్తుతెలియని మృతదేహాలను కనుగొనడానికి బరుయ్‌పూర్, బసిర్‌హట్‌లలోని సౌత్ 24 పరగణాస్ పోలీసులతో విచారణ ప్రారంభించాం" అని ఘోష్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios