విమానంలో బాంబు ఉందంటూ ప్రయాణికుడి కేకలు.. తీరా తనిఖీ చేస్తే..
కోల్కతా నుంచి దోహా వెళ్లడానికి సిద్దంగా ఉన్న ఖతార్ ఎయిర్వేస్ విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు కేకలు వేయడంతో కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికుల కిందకు దించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Qatar Airways: కోల్కతా నుంచి దోహా వెళ్తున్న ఖతార్ ఎయిర్వేస్ విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు కేకలు వేయడంతో కలకలం రేగింది. వెంటనే ఆ విమానాన్ని ల్యాడింగ్ చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సీఐఎస్ఎఫ్కు సమాచారం అందించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి స్నిఫర్ డాగ్ సహాయంతో విమానంలో శోధించారు. విమానం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన ఎలాంటి అనవాళ్లు లభించలేదు. దీంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం ప్రకారం.. మంగళవారం (జూన్ 6) తెల్లవారుజామున 3.29 గంటలకు కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 541 మంది ప్రయాణికులతో దోహా మీదుగా లండన్కు వెళ్లే ఖతార్ ఎయిర్వేస్ విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ అరిచాడు. విమాన సిబ్బంది వెంటనే సీఐఎస్ఎఫ్కు సమాచారం అందించారు. ప్రయాణికులను దించేశారు.దీని తర్వాత స్నిఫర్ డాగ్స్ సహాయంతో విమానం మొత్తం వెతికినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు.
అనంతరం బాంబు ఉందంటూ కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ తర్వాత.. సదరు వ్యక్తి తండ్రిని విమానాశ్రయానికి పిలిచారు. తన కొడుకు మానసిక స్థితి సరిగా లేదనీ, మానసిక వ్యాధికి చికిత్స పొందుతున్నాడని తెలిపే కొన్ని పత్రాలను భద్రతా సిబ్బందికి సమర్పించాడు.
ముంబయి విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే
తాజాగా ముంబై ఎయిర్పోర్టులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన సూట్కేస్లో బాంబు ఉందని ఓ మహిళ పేర్కొంది. వాస్తవానికి బోర్డింగ్ సమయంలో అదనపు లగేజీ కారణంగా సిబ్బంది ఆమె సామానును తీసుకెళ్లకుండా ఆపారు. దీంతో ఆ మహిళ తన బ్యాగ్లో బాంబు ఉందని చెప్పింది. మహిళను అదుపులోకి తీసుకుని లగేజీని తనిఖీ చేసినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.