కోల్ కతాలో భారీ అగ్నిప్రమాదం: ఫైర్ మెన్, పోలీసు సహా 9 మంది మృతి
పశ్చిమ బెంగాల్ రాజదాని కోల్ కతాలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మృతుల్లో ఫైర్ మెన్, పోలీసు ఉన్నారు.
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోల్ కతాలోని స్ట్రాండ్ రోడ్డులో గల ఓ కార్యాలయ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు ఫైర్ మెన్, ఓ పోలీసు అధికారి, ఇద్దరు రైల్వే ఆఫీసర్లు, ఓ సెక్యూరిటీ అధికారి ఉన్నారు.
ఐదు మృతదేహాలు భవనం 12వ అంతస్థులోని ఎలివేటర్ లో పడి ఉన్నాయి. బాధితులు లిఫ్ట్ లో శ్వాస ఆడక, లిఫ్ట్ లోపలే మరణించినట్లు తెలుస్తోంది. సంఘటన పట్ల రైల్వే మంత్రి పియూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణం కోసం విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
మృతులకు పియూష్ గోయల్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నలుగురు పైర్ పైటర్స్, ఇద్దరు రైల్వే అధికారులు, ఓ అసిస్టెంట్ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ మృతుల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
జిఎంతో పాటు రైల్వే అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆశించారు.
సాయంత్రం 6.30 గంటలకు మంటలు లేవడం ప్రారంభమైన వెంటనే సంబంధిత మంత్రి, అర్బన్ అఫైర్స్ మంత్రి, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. భవనం 13వ అంతస్థులో చెలరేగిన మంటలను ఆర్పడానికి 25 ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చెలరేగిన సమయంలో ఎలివేటర్ ను వాడారని, దాని వల్ల మరణాలు సంభవించాయని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలేసి నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు.
స్ట్రాండ్ రోడ్డులోని హుగ్లీ నది పక్కన ఉన్న న్యూ కోయిల్ ఘాట్ భవనంలోని 13వ అంతస్థులో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో రైల్వే కార్యాలయాలు ఉన్నాయి.