బెంగాల్: కోల్కతాలో బొగ్గు స్మగ్లింగ్ కేసు విచారణలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ప్రశ్నించింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని శుక్రవారం నాడు కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బొగ్గు స్మగ్లింగ్ విచారణలో భాగంగా దాదాపు ఎనిమిది గంటలు ఆయనను ప్రశ్నించింది. 'మరో పార్టీ అధినేతను ' పప్పు ' అని బీజేపీ వాదిస్తోంది. కానీ వాస్తవానికి అమిత్ షానే పెద్ద ' పప్పు ' అని.. ఆయన (కేంద్ర) ఏజెన్సీలను ఉపయోగించకుండా రాజకీయాలు చేయలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారని ఎన్డీటీవీ నివేదించింది.
బెంగాల్లో బొగ్గు, పశువుల స్మగ్లింగ్కు షాను నేరుగా బాధ్యుడిని చేస్తూ.."సిఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)కు బొగ్గు కుంభకోణంతో సంబంధం ఉంది. సరిహద్దులో పశువుల అక్రమ రవాణా జరిగినప్పుడు బిఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) ఏమి చేస్తోంది? ఇది గోవుల అక్రమ రవాణా కాదు, హోం మంత్రి అవినీతి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ స్వయంగా ఆవు దొంగ. ఆవు దొంగతనంపై విచారణ ఆవు దొంగలు చేస్తున్నారు" అంటూ అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. తన ప్రశ్నోత్తరాల తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "నేను ఐదు పైసలు కూడా అక్రమంగా తీసుకున్నట్లు ఎవరైనా రుజువు చేయగలిగితే, ఉరి వేయడానికి సిద్ధం.. నేను 30 సార్లు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బెంగాల్ ప్రజల ముందు తల వంచడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ బీజేపీ ముందు ఎన్నటికీ తలవంచను" అని అన్నారు.
కాగా, అభిషేక్ బెనర్జీని ఈడీ ప్రశ్నించడం ఇది మూడోసారి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ ఏడాది జూలైలో బొగ్గు కుంభకోణంలో పాల్గొన్న 41 మంది వ్యక్తులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది, అయితే అందులో అభిషేక్ బెనర్జీ పేరు లేదు. ఆసియాలో పాకిస్థాన్ను భారత్ ఓడించిన తర్వాత వీడియో ఆధారంగా ప్రతిపక్ష పార్టీలు "జాతీయ జెండా ఊపేందుకు నిరాకరించారని" ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన కేంద్ర హోంమంత్రి తనయుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షాపై పై కూడా విమర్శలు గుప్పించారు. గత ఆదివారం దుబాయ్లో జరిగిన కప్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటననున ప్రస్తావిస్తూ.. "బెంగాల్ ప్రజలకు దేశభక్తిని నేర్పడానికి ప్రయత్నించే ముందు అతను (అమిత్ షా) తన కొడుకుకు దేశభక్తి నేర్పించనివ్వండి. అతను అనుకుంటే ఈడీ, సీబీఐని పంపి నన్ను భయపెడతాడు. ఎందుకంటే నేను అతని కొడుకును విమర్శించాను కాబట్టి, అతను తప్పుగా భావించాడు. వారు నా భార్యను-నన్ను ఇప్పటివరకు ఏడుసార్లు ప్రశ్నించారు, కానీ ఫలితం శూన్యం. అయినప్పటికీ, లంచం తీసుకుంటూ కెమెరాలో చిక్కుకున్న బీజేపీ నాయకులను కేంద్ర ఏజెన్సీలు ఎప్పుడూ ప్రశ్నించలేదు" అని విమర్శించారు.
బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీకి చెందిన సువేందు అధికారి ఇప్పుడు కనిపించకుండా పోయిన బొగ్గు కుంభకోణంలో నిందితులలో ఒకరితో టచ్లో ఉన్నారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. తన కేసును నిరూపించేందుకు తన వద్ద ఆడియో క్లిప్ ఉందని, దానిని కోర్టులో సమర్పిస్తానని పేర్కొన్నాడు. కాగా, అభిషేక్ బెనర్జీ ఉదయం 10.30 గంటలకు సాల్ట్ లేక్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల (సీజీవో) కాంప్లెక్స్కు చేరుకున్నప్పుడు.. తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరును ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసిన క్లిప్లను షేర్ చేసింది.
