Kishan Reddy: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Telangana: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం కేసీఆర్ దాటవేయడం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందంటూ వ్యాఖ్యానించారు.
K Chandrasekhar Rao: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం కేసీఆర్ దాటవేయడం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి లేనిపోని అబద్దాలు చేబుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. వివరాల్లోకెళ్తే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమతి (టీఆర్ఎస్) సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశానికి హాజరుకాకుండా తప్పించుకున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతో ఉందని పేర్కొన్నారు. అందుకే అబద్ధాలు చెబుతున్నారనీ, ప్రధాని నరేంద్ర మోడీపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా, ఆగస్టు 7న నీతి ఆయోగ్ ఏడో పాలక మండలి సమావేశం జరిగింది. దీనికి ముందు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు శనివారం నాడు వెల్లడించారు. ఇదే విషయం గురించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ ద్వారా తెలిపినట్లు వెల్లడించారు. తెలంగాణ సహా రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్ష కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయత్నాల్లో కేంద్రం రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా చూడడం లేదని కేసీఆర్ ఆరోపించారు.
కేసీఆర్ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత 8 ఏళ్లుగా కేసీఆర్ పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రుణాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. పెట్రోల్ ధరలు రాష్ట్రంలోనే అత్యధికం ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతున్నందున, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఓడిపోతుందని వారు భయపడుతున్నారు. తన కుమారుడిని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. ఇలా ప్రధాని నరేంద్ర మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో ఎంతోబాగా పనిచేస్తుంటే.. టీఆర్ఎస్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై ఆ విషయాన్ని చెప్పి ఉండాల్సిందని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ వచ్చి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడటం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా నిధులు కావాలని కోరినట్లు రెడ్డి పేర్కొన్నారు. “ఇంతకుముందు, వారు ఎంత నిధులు తీసుకున్నా, వారు తమ అవినీతి కార్యకలాపాలకు ఖర్చు చేశారు. ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ రూ.50-80 వేల కోట్ల రుణాలను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసి మొత్తం సొమ్మును దోచుకున్నాయని ఆయన మండిపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరు కావడాన్ని ఎత్తిచూపిన రెడ్డి, నీతి ఆయోగ్ స్వతంత్ర సంస్థ అని, నిష్పక్షపాతంగా అన్ని రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తుందని, నీతి ఆయోగ్ వల్ల ఉపయోగం లేదని, దాని సమావేశం వృధా అని కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, కేసీఆర్కి సభకు హాజరవ్వడం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలకు ఇది ముఖ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందున నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది అని అన్నారు. ‘‘కేసీఆర్, ఆయన విధానాలతో విసిగి వేసారిన తెలంగాణ ప్రజలు ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, నీతి ఆయోగ్తో పాటు రాజ్యాంగాన్ని కూడా టీఆర్ఎస్ హీనంగా మాట్లాడుతోంది. తమ స్వలాభం కోసం రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు' అని ఆయన అన్నారు.