అది నచ్చకే పార్టీని వీడుతున్నా.. సోనియాకి ఖుష్బూ లేఖ
గత ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమెను ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి ఆ పార్టీ తప్పించింది. దీంతో ఖుష్బూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
సినీ నటి ఖుష్బూ.. కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీని వీడనున్నారటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కాగా.. ఆ ప్రచారానికి ఇప్పుడు తెరపడింది. ఆమె.. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు.
గత ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమెను ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి ఆ పార్టీ తప్పించింది. దీంతో ఖుష్బూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు .. గ్రౌండ్ రియాల్టీ తెలియకుండానే ఆదేశాలు ఇస్తున్నారని, ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఖుష్బూ ఇవాళ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ రోజే ఖుష్బూ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. దీనికోసం ఆమె ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం ఖాయమైంది.
ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డీఎంకేతో బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి కూడా అన్నా డీఎంకే అధికారంలోకి రావడమంటూ జరిగితే.. ఖుష్బూకు మంత్రిపదవి ఆఫర్ చేస్తారనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. 2010లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఖుష్బూ ఆ పార్టీకి పనిచేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ పార్టీని వీడిన ఖుష్బూ.. సోనియా గాంధీతో భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు.