నర్సింగ్ విద్యార్థి కిడ్నాప్.. రూ.2కోట్లు డిమాండ్.. చివరకు..
గత కొంతకాలంగా అతను ఇంటి నుంచే ఆన్ లైన్ క్లాసులు వింటున్నాడు. కాగా.. ఇటీవల అతను బయటకు వెళ్లగా.. నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
నర్సింగ్ విద్యార్థి ని ఓ ముఠా కిడ్నాప్ చేసింది. రూ.2కోట్లు ఇస్తేనే.. తిరిగి అప్పగిస్తామంటూ సదరు కిడ్నాపర్లు డిమాండ్ చేయడం గమనార్హం. అయితే...ఈ కేసును పోలీసులు కేవలం ఏడు గంటల్లోనే చేధించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరు నగరానికి చెందిన రబీజ్ అరాఫత్ యూకేలో నర్సింగ్ లో ఎంఎస్ చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను ఇంటి నుంచే ఆన్ లైన్ క్లాసులు వింటున్నాడు. కాగా.. ఇటీవల అతను బయటకు వెళ్లగా.. నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం అతని తండ్రికి ఫోన్ చేసి కిడ్నాప్ సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన కుమారుడి సెల్కు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. వెంటనే కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా.. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని కేవలం ఏడు గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. అప్పులు తీర్చడానికి నిందితులు అబ్దుల్ పహాద్, జబీవుల్లా, సయ్యద్సల్మాన్, తౌహిద్లు మరికొందరితో కలిసి కిడ్నాప్ పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నగరంలో శ్రీమంతుల గురించి ఆరా తీశారు.
రబీజ్ అరాఫత్ వివరాలు సేకరించి కిడ్నాప్ చేయడానికి పథకం వేశారు. అంతకు ముందే ఓ కారును కొనుగోలు చేశారు. పథకం ప్రకారం రబీజ్ను బయటకు రప్పించి కిడ్నాప్ చేశారు. అన్నిదారులు దిగ్బంధం చేయడంతో కిడ్నాపర్లు సులువుగా దొరికిపోయారు. కిడ్నాప్ సూత్రధారి అబ్దుల్ పహాద్పై గతంలో కూడా కేజీహళ్లి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది.