కేరళలో బుర్ఖా ధరించిన ఆలయ పూజారీ.. ఎందుకో తెలుసా?
కేరళలో ఓ పురోహితుడు బుర్ఖా ధరించి వీధులు తిరుగుతూ కనిపించారు. ఆటో డ్రైవర్లు అతడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పజెప్పారు. ఆయనకు చికెన్ పాక్స్ ఉన్నందున బుర్ఖా ధరించినట్టు పురోహితుడు తెలిపారు.
తిరువనంతపురం: బుర్ఖా ధరించడం ఇస్లాం సంప్రదాయం. అదీ మహిళలు ధరిస్తారు. హిందువులు బుర్ఖా ధరించరు. అదీ పురోహితులు అసలే ధరించరు. కానీ, కేరళలో ఓ ఆలయ పూజారీ బుర్ఖా ధరించి వీధుల్లో తిరుగుతుండటం కొందరి కంట పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోజికోడ్ జిల్లాలోని కొయిలాండీలో 28 ఏళ్ల పురోహితుడు జిష్ణు నంబూతిరి బుర్ఖా ధరించి వీధులు తిరుగుతూ పట్టుబడ్డాడు.
మెప్పాయూర్ సమీపంలోని ఓ దేవాలయంలో జిష్ణు నంబూతిరి పౌరోహిత్యం చేస్తున్నారు. ఆయన కొయిలాండీ జంక్షన్లో బుర్ఖా ధరించి తిరిగారు. అనుమానాస్పదంగా కనిపించిన అతడిని ఆటో డ్రైవర్లు పట్టుకున్నారు. వీధుల్లో బుర్ఖా వేసుకుని తిరుగాడుతున్న అతడిని పోలీసులకు పట్టించారు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.
బుర్ఖా ఎందుకు ధరించావని, ధరించి ఎందుకు వీధుల్లో తిరుగుతున్నావని పోలీసులు పురోహితుడు జిష్ణు నంబూతిరిని అడిగారు. అందుకు సమాధానంగా తనకు చికెన్ పాక్స్ వచ్చినట్టు సమాధానం ఇచ్చారని పోలీసులు ఆదివారం తెలిపారు. అయితే, జిష్ణు నంబూతిరి ఒంటిపై చికెన్ పాక్స్కు సంబంధించిన ఆనవాళ్లు ఏవీ కనిపించలేదని పోలీసులు వివరించారు. కానీ, ఆయన ఏ నేరమూ చేసినట్టు ఫిర్యాదులు అందలేవని తెలిపారు. కాబట్టి, వారి బంధువులు పోలీసు స్టేషన్కు వచ్చిన తర్వాత వదిలిపెట్టినట్టు వివరించారు.
జిష్ణు నంబూతిరి పేర్లు, చిరునామా, ఇతర వివరాలు పరిశీలించి అతడిని వదిలిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.