కేరళలో అధికార సీపీఎం ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై అనుసరిస్తున్న వైఖరి జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఏషియానెట్ న్యూస్ ప్రతినిధిపై కేరళ పోలీసులు వింత చర్యకు దిగారు.
కేరళలో అధికార సీపీఎం ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై అనుసరిస్తున్న వైఖరి జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఏషియానెట్ న్యూస్ ప్రతినిధిపై కేరళ పోలీసులు వింత చర్యకు దిగారు. మహారాజా కాలేజీలో వామపక్ష-మద్దతుగల స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు(ఎస్ఎఫ్ఐ) చెందిన కొంతమంది సభ్యుల అవకతవకల ఆరోపణలపై రిపోర్ట్ చేసినందుకు గానూ ఏషియానెట్ న్యూస్ చీఫ్ రిపోర్టర్ అఖిలా నందకుమార్పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిలను కుట్ర కేసులో ఇరికించారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పీఎం అర్షో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అర్షో చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అఖిల నందకుమార్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ జాయ్, ఆర్కియాలజీ విభాగం అధిపతి డాక్టర్ వినోద్ కుమార్ మొదటి ఇద్దరు నిందితులుగా ఉన్నారు. కేఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు అలోసియస్ జేవియర్, కేఎస్యూ మహారాజా యూనిట్ అధ్యక్షుడు సీఏ ఫైసల్లు మూడు, నాలుగో నిందితులుగా ఉన్నారు. ఇదే కేసులో అఖిలను కూడా నిందితురాలిగా చేర్చారు.
అసలేం జరిగిందంటే.. మాజీ ఎస్ఎఫ్ఐ నాయకురాలు విద్యా ఫోర్జరీ కేసులో వివరాల కోసం జూన్ 6వ తేదీన అఖిల, ఆమె కెమెరామెన్ మహారాజా కళాశాల క్యాంపస్కు చేరుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పదవి కోసం నకిలీ పత్రాలను రూపొందించినట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి విద్యా పరారీలో ఉంది. ఉదయం 11 గంటల వార్తలకు సంబంధించి.. మహారాజా కాలేజ్ ప్రిన్సిపాల్తో పాటు మలయాళ విభాగం టీచర్తో అఖిల లైవ్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యా ఫోర్జరీకి సంబంధించి ప్రిన్సిపాల్ రూమ్లో ఉన్న విద్యార్థి ప్రతినిధులను అఖిల స్పందన స్పందన కోరింది.
అప్పుడే విద్యార్థి ప్రతినిధి ఒకరు ఆర్షో మార్క్ లిస్ట్ వివాదాన్ని లేవనెత్తుతూ.. ఇంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉందని అన్నారు. దీంతో విద్యా ఫోర్జరీ కేసుతో పాటు.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మార్క్ లిస్టు వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఘటనను తనపై జరిగిన కుట్రగా అర్షో అర్థం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై కొచ్చి సెంట్రల్ పోలీసులు ఏషియానెట్ న్యూస్ చీఫ్ రిపోర్టర్ అఖిలా నందకుమార్పై కేసు నమోదు చేశారు.
ఫోర్జరీ కేసులోని సమాచారాన్ని సాధారణ ప్రజలకు చేరవేసేందుకు క్యాంపస్కు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు కుట్ర అభియోగాలు మోపారు. ఫోర్జరీ కేసులో నిందితురాలి ఉన్న విద్యా జాడ కూడా కనుగొనలేని రాష్ట్ర హోంశాఖ.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఫిర్యాదుపై మెరుపువేగంతో కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేపట్టింది.
