Kerala: గందరగోళంగా కేరళ అసెంబ్లీ సెషన్.. రాహుల్ గాంధీ ఆఫీసు దాడిపై సభలో రసాభాస !
Kerala Assembly session: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి చెందిన వయనాడ్ లోని కార్యాలయాన్ని ధ్వంసం చేయడంపై ప్రతిపక్షాలు కేరళ అసెంబ్లీ సమావేశాన్ని అడ్డుకున్నాయి. సభ ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగించవద్దని స్పీకర్ ఎంబీ రాజేష్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు.
Kerala Assembly session: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి చెందిన వయనాడ్ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పాటు రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిణామాలకు సంబంధించి అంశాలను లేవనెత్తుతూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో 15వ కేరళ శాసనసభ ఐదవ సెషన్ సోమవారం ఉదయం కొద్దిసేపు వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్షాలు టేబుళ్లను కొట్టడం ప్రారంభించి, మొదటి ప్రశ్నకు సమాధానం చెబుతూనే నినాదాలు చేయడం ప్రారంభించారు. సభ ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగించవద్దని స్పీకర్ ఎంబీ రాజేష్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. సభా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా ప్లకార్డులు, బ్యానర్లు ఊపవద్దని విపక్ష సభ్యులను స్పీకర్ కోరారు.
తమ వాయిదా నోటీసు పరిశీలనకు తన ముందు ఉందని, అయితే విపక్ష సభ్యులు “ఎస్ఎఫ్ఐ గూండాయిజం” అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే, వారు దానిని కూడా పట్టించుకోకపోవడంతో విపక్షాల, ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది. విపక్షాలు పదే పదే విజ్ఞప్తి చేసినా శాంతించకపోవడంతో స్పీకర్ సభను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆయన చెప్పలేదు. ఉదయం 9.42 గంటల వరకు సభ తిరిగి ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్పై బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు వెల్లడించిన విస్మయకర విషయాలు మొదలుకుని రాహుల్ గాంధీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఆయా అంశాలను లేవనెత్తుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. సమావేశాలకు ముందే ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ప్రతిపక్షం తగినంత సిద్ధమైందనీ, అసెంబ్లీ సెషన్ గందరగోళంగా మారుతుందని భావించారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లను చర్చించి ఆమోదించడానికి ఒక నెలపాటు జరిగే ఈ సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేశారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వివాదాలను సభలో లేవనెత్తుతామని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతామని వెల్లడించింది. ఇదిలావుండగా, రాష్ట్రంలో బంగారం స్మగ్లింగ్ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు ప్రభుత్వ నేతలు తెస్తున్న ఒత్తిడిని మీడియా ముందు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి చెందిన వయనాడ్ లోని కార్యాలయంపై ఎస్ఎఫ్ష్ఐ కి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీసులోని పర్నీచర్ ధ్వసం చేశారు. అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఇలా దాడులకు దిగుతున్న చర్యలను తప్పుపట్టాయి. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.