24 ఏళ్ల యువతితో 40 ఏళ్ల మహిళ సహాజీవనానికి కోర్టు గ్రీన్ సిగ్నల్
స్వలింగ సంపర్కం విషయంలో కేరళ హైకోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది.
తిరువనంతపురం:స్వలింగ సంపర్కం విషయంలో కేరళ హైకోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ 40 ఏళ్ల మహిళ.. 24 ఏళ్ల యువతితో కలిసి జీవించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చట్టబద్దం చేసిన విషయం తెలిసిందే. సీకే అబ్దుల్ రహీమ్, నారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఇద్దరు మహిళలు సహాజీవనం చేయవచ్చని తీర్పు చెప్పింది.
కేరళ రాష్ట్రంలోని వెస్ట్ కల్లాడకు చెందిన 40 ఏళ్ల శ్రీజ హెబియన్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. 24 ఏళ్ల అరుణను కోర్టు ముందు హాజరుపర్చాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు. తనకు అరుణతో కలిసి జీవించాలని ఉందని శ్రీజ కోర్టుకు తెలిపింది.
గత ఏడాది ఆగష్టు నుండి తాము కలిసి ఉంటున్నామని.. అరుణ తల్లిదండ్రులు ఆమెను తన నుండి దూరం చేశారని శ్రీజ చెప్పారు. అరుణను బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఆసుపత్రిలో ఉన్న అరుణను తాను కలిసినట్టు చెప్పారు. అరుణను తనతో తీసుకెళ్లేందుకు ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తీసుకెళ్లేందుకు ఒప్పుకోవడం లేదని కోర్టుకు తెలిపింది.
అరుణను తన వద్దకు పంపించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును ఆమె కోరింది. అంతేకాదు సెక్షన్ 377 సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడ ప్రస్తావించారు. కోర్టు ఆదేశాల మేరకు అరుణను కోర్టు ముందు హాజరుపర్చారు. శ్రీజతో కలిసి ఉండడంలో తన ఉద్దేశాన్ని అరుణ వివరించింది. దీంతో వీరిద్దరూ కూడ కలిసి ఉండేందుకు అభ్యంతరం లేదని కోర్టు తెలిపింది. వీరిద్దరూ సహాజీవనం చేసుకోవచ్చని కోర్టు ప్రకటించింది.