‘కొడియేరి’తో కడవరకు.. మిత్రుడి అంతిమ యాత్రలో 2.5 కి.మీ.లు నడిచిన కేరళ సీఎం పినరయి విజయన్
సీపీఎం సీనియర్ నేత కొడియేరి బాలక్రిష్ణ మృతదేహం పక్కనే కేరళ సీఎం పినరయి విజయన్ కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రోజు ఆయన కొడియేరి అంతిమ యాత్రలో పాల్గొని సుమారు రెండున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.
తిరువనంతపురం: సీపీఎం దిగ్గజ నేత కొడియేరి బాలక్రిష్ణన్ కన్నుమూశారు. కొడియేరి ప్రజల నేత. పార్టీ నేతలతోపాటు ప్రజలూ ఆయనను అమితంగా ఆదరించేవారు. కేరళ సీఎం పినరయి విజయన్కు సన్నిహితుడు. కొడియేరి బాలక్రిష్ణన్ మరణంతో కేరళ సీఎం పినరయి దిగ్భ్రాంతికి గురయ్యారు. కొడియేరి మరణం పార్టీకి తీరని నష్టం అని సీఎం చెప్పారు.
కామ్రేడ్ కొడియేరి బాలక్రిష్ణన్ అంతిమ యాత్రలో సీఎం పినరయి రెండున్నర కిలోమీటర్లు నడిచారు. పయ్యంబలం బీచ్ వరకు ఆయన మిత్రుడు కొడియేరి బాలక్రిష్ణన్ దేహంతోపాటే నడుచుకుంటూ వెళ్లారు. కన్నూర్ జిల్లా కమిటీ కార్యాలయంలో కొడియేరి బాలక్రిష్ణన్ దేహాన్ని దర్శనం కోసం గంట సేపు ఉంచారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభించారు.
కొడియేరి బాలక్రిష్ణన్ డెడ్ బాడీ పక్కనే సీఎం పినరయి విజయన్ కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతిమ యాత్రలో సీపీఎం లీడర్లు పీబీ మెంబర్ ఎంఏ బేబీ, రాష్ట్ర సెక్రెటరీ ఎంవీ గోవిందన్, జిల్లా సెక్రెటరీ ఎంవీ జయరాజన్, పీబీ సభ్యుడు విజయరాఘవన్లు కూడా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు నినాదాలు ఇస్తూ నడుచుకుంటూ వెళ్ాలరు. కొడియేరి అంతిమ యాత్రలో వేలాది మంది మద్దతుదారులు, నేతలు పాల్గొన్నారు. చివరకు పయ్యంబలం బీచ్లో కొడియేరి బాలక్రిష్ణ భౌతిక దేహాన్ని దహనం చేశారు.