తమ రాష్ట్రంలో ఉన్న ముళ్లై పెరియార్ ప్రాజెక్ట్ నుంచి నీటిని అకస్మాత్తుగా విడుదల చేయడం వల్ల తమ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. 

తిరువనంతపురం: తమ రాష్ట్రంలో వరదలపై కేరళ ప్రభుత్వం తమిళనాడును నిందించింది.ఇటీవలి వరదలకు తమిళనాడు కారణమని కేరళ ఆరోపించింది. తమ రాష్ట్రంలో ఉన్న ముళ్లై పెరియార్ ప్రాజెక్ట్ నుంచి నీటిని అకస్మాత్తుగా విడుదల చేయడం వల్ల తమ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వరదలను నివారించడానికి ముళ్లై పెరియార్ డ్యామ్ లో నీటి నిల్వ స్థాయిని 139 అడుగుల వరకు ఉంచాలని తాము విజ్ఞప్తి చేసినా తమిళనాడు పట్టించుకోలేదని తెలిపింది. ముళ్లై పెరియార్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని, ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో కేరళ అల్లకల్లోలంగా మారిందని కేరళ ప్రధాన కార్యదర్శి చెప్పారు. 

తమిళనాడు ప్రజలకు నీటిని అందించే ముళ్లైపెరియార్ ప్రాజెక్టును కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని నిర్వహణ కూడా తమిళనాడుదే. డ్యామ్ పాతది కావడం వల్ల కూల్చివేసి కొత్త డ్యామ్ నిర్మించాలని కేరళ చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. 

కేరళను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తడంతో 373 మంది మరణించగా, 32 మంది కనిపించకుండా పోయారు. 12.5 లక్షల మందిని 3941 పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదల వల్ల కేరళలో 19,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.