కేరళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. మీడియాను అణచివేసే రీతిలో సీపీఎం ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతున్నదని, దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని వివరించింది. ఏషియానెట్ న్యూస్‌తో సహాయ నిరాకరణను రెండేళ్ల తర్వాత ప్రస్తుత ఆపత్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విరమించాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

తిరువనంతపురం: బీజేపీ కేరళ యూనిట్ ఏషియానెట్ న్యూస్‌తో సానుకూలంగా వ్యవహరించడానికి నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల సహాయనిరాకరణను విరమించుకుంటున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం మీడియాను వెంటాడి వేటాడుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేరళ బీజేపీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఆపద సమయంలో మీడియాకు అండగా,పాత్రికేయ స్వేచ్ఛకు మద్దతుగా నిలబడాలని బీజేపీ బాధ్యత తీసుకుందని బీజేపీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్రన్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అటు మీడియాను, ఇటు బీజేపీని టార్గెట్ చేసుకుందని పేర్కొన్నారు.

ప్రజాస్వామిక విలువలకు మారుపేరుగా నిలిచే కేరళ.. ఏషియానెట్ న్యూస్, ఆ సంస్థ జర్నలిస్టుల పట్ల సీపీఎం ఫాసిస్టు పోకడలను అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను జ్ఞప్తికి తెస్తున్నాయని వివరించారు.

Also Read: ఫ్లైట్‌లో వెళ్లి పక్కా ప్లాన్‌తో చోరీలు.. కేరళలో తెలంగాణ యువకుడి అరెస్ట్..

మీడియా స్వేచ్ఛను నాశనం చేయాలని, మీడియా ప్రతినిధులను అవమానించడానికి పినరయి విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కే సురేంద్రన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయినటువంటి మీడియాను అణచివేసే కమ్యూనిస్టు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తాము బలమైన ప్రజా నిసరనకు నాయకత్వం వహిస్తామని వెల్లడించారు.